ఐపీఎల్పై కేరళ ప్రొఫెసర్ పద్యాలు
ABN , First Publish Date - 2020-09-28T10:55:05+05:30 IST
దేశంలో ఐపీఎల్కున్న ఆదరణ సాధారణమైనది కాదు. చిన్నోళ్ల నుంచి పెద్దోళ్ల వరకు ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ లీగ్ గురించే చర్చ.
కొచ్చి: దేశంలో ఐపీఎల్కున్న ఆదరణ సాధారణమైనది కాదు. చిన్నోళ్ల నుంచి పెద్దోళ్ల వరకు ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ లీగ్ గురించే చర్చ. తాజాగా కేరళకు చెందిన వశిష్ఠ్ అనే ప్రొఫెసర్ ఐపీఎల్ లీగ్ మీద, అందులోని ఎనిమిది జట్లపైన తన విద్యార్థులతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాశారు. ‘ఐపీఎల్.. క్రాసింగ్ ద బౌండరీస్’ పేరిట ఆ పద్యాలను పుస్తక రూపంలో విడుదల చేశారు. వశిష్ఠ్ కాలికట్లోని మలబార్ క్రిస్టియన్ కళాశాలలో చరిత్ర విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ఆయన కిందటి ఏడాది వన్డే వరల్డ్కప్ జరుగుతున్న సమయంలో కూడా భారత జట్టుపై ఓ పాటను రూపొందించి విడుదల చేశారు. ఇంకా తన కళాశాల గ్రంథాలయంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఏకంగా ఓ గ్యాలరీనే రూపొందించారు. దానిలో సచిన్పై 11 భాషల్లో వచ్చిన అనేక పుస్తకాలు, బ్రోచర్స్ను ఉంచారు.