కబడ్డీ కోర్టులోనే చివరి మజిలీ
ABN , First Publish Date - 2021-08-04T08:55:16+05:30 IST
కబడ్డీ కోర్టే ఆ క్రీడాకారుడికి చివరి మజిలీ అయింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ కానిస్టేబుల్ని..
రోడ్డు ప్రమాదంలో కబడ్డీ క్రీడాకారుడు మృతి
ప్రత్యేకంగా కబడ్డీ కోర్టులో ఖననం
భీమదేవరపల్లి, ఆగస్టు 3 : కబడ్డీ కోర్టే ఆ క్రీడాకారుడికి చివరి మజిలీ అయింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ కానిస్టేబుల్ని తోటి క్రీడాకారు లు, కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేకంగా కబడ్డీ కోర్టు గీసి అందులో గుంతతీసి ఖననం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లికి చెందిన పిట్టల కిరణ్(35)కు చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ప్రాణం. యూనివర్సిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కబడ్డీ ఆడి ప్రతిభ కనబరిచి మంచి పేరు తెచ్చుకున్నారు.
2009లో స్పోర్ట్స్ కోటాలో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న కిరణ్ సోమవారం భీమదేవరపల్లికి వచ్చారు. ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు కారు ఢీకొనడంతో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, తోటి క్రీడాకారులు, స్నేహితులు వ్యవసాయ భూమిలో ప్రత్యేకంగా కబడ్డీ కోర్టును వేసి, అందులో గోయి తీసి ఖననం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మార్పాటి మహేందర్రెడ్డి మృతదేహంపై క్రీడాదుస్తులను ఉంచి నివాళులు అర్పించారు.