రిలయన్స్ రిటైల్లో రూ.5,550 కోట్ల పెట్టుబడికి కేకేఆర్ ఓకే
ABN , First Publish Date - 2020-09-23T18:59:21+05:30 IST
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్..
ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కేకేఆర్తో మరో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లో 1.28 శాతం ఈక్విటీ వాటా కోసం రూ.5,550 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కేకేఆర్ సిద్ధమైంది. దీంతో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు పెరిగింది. కాగా ఈ నెల రోజుల వ్యవధిలో 3.03 శాతం వాటా విక్రయం ద్వారా రిలయన్స్ రిటైల్ రూ. 13,050 కోట్లు సమీకరించడం విశేషం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థల్లో కేకేఆర్ పెట్టుబడులు పెట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాదిలోనే ఆర్ఐఎల్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్ఫార్మ్స్లో కేకేఆర్ రూ. 11,367 కోట్ల పెట్టుబడి పెట్టింది.
కాగా తాజా ఒప్పందం సందర్భంగా ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘రిలయన్స్ రిటైల్ వెంచర్స్లోకి ఇన్వెస్టర్గా వస్తున్న కేకేఆర్కు సాదర స్వాగతం పలుకుతున్నాను. భారతీయులందరి ప్రయోజనాల కోసం భారత రిటైల్ ఎకోసిస్టమ్లో సరికొత్త మార్పు తీసుకొచ్చి, బలోపేతం చేసే దిశగా మా ప్రయాణం కొనసాగుతోంది..’’ అని పేర్కొన్నారు. ఇండస్ట్రీ-లీడింగ్ ఫ్రాంచైజీల్లో ఓ విలువైన భాగస్వామిగా ఇప్పటికే కేకేఆర్ నిరూపించుకున్నదనీ.. అనేక ఏళ్లుగా ఈ సంస్థ భారతదేశంతో అనుబంధం కొనసాగిస్తున్నదని ఆయన గుర్తుచేశారు.