గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2021-09-18T06:05:12+05:30 IST
వినాయక నిమజ్జనానికి సర్వంసిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామని సీపీ విష్ణు ఎస్ వారియర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆంక్షల మధ్య ఖమ్మంలో రేపు శోభాయాత్ర
ఖమ్మం క్రైం, సెప్టెంబరు 17: వినాయక నిమజ్జనానికి సర్వంసిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామని సీపీ విష్ణు ఎస్ వారియర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గణేష్నిమజ్జనం కోసం నగరంలోని కాల్వఒడ్డు సమీపంలోని మున్నేరు, ప్రకాష్నగర్లోని మున్నేరువద్ద నిమజ్జన ఏర్పాట్లు చేపట్టామన్నారు. పోలీసు, రెవెన్యూ, మునిసిపల్, ఆర్అండ్బీ, వైద్య, విద్యుత్శాఖల సమన్వయంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బారీకేడ్లు ఏర్పాటుచేయడంతో పాటు నిరంతరం పోలీసు పర్యవేక్షణ ఉంటుందన్నారు. జిల్లాలో సుమారు 1700గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారనే అంచనా ఉందని, నిర్వాహకులు పోలీసు నిబంధనలను పాటించి.. సమస్యలు తలెత్తకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. నిమజ్జనం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఐదుగురు ఏసీపీలు, 13మంది సీఐలు, 28మంది ఎస్ఐలు, 29మంది ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుళ్లు, 100మంది కానిస్టేబుళ్లు, ఉమెన్హెడ్కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లు పదిమంది, 50మంది హోంగార్డులు, ఒక ఏఆర్ ఫోర్సు సెక్షన్ బందోబస్తు విదుల్లో ఉంటారన్నారు.
నగరంలో శోభాయాత్ర మార్గాలు..
శ్రీరాంహిల్స్, సంబానినగర్, ముస్తఫానగర్, చర్చికాం పౌండ్, కమాన్బజార్, కస్బాబజార్, స్టేషన్రోడ్, బోనకల్ రోడ్, జడ్పీసెంటర్ ఏరియాల విగ్రహాలు చర్చికాంపౌండ్, పటేల్టింబర్ డిపోమీదుగా ప్రకాష్నగర్ మున్నేరు పాయింట్వద్దకు కాని, పటేల్ టింబర్ డిపో, గుట్టలబజార్, గాంధీచౌక్ మీదుగా నయాబజార్కు చేరుకోవాలి.
రాపర్తినగర్, బుర్హాన్పురం, మామిళ్లగూడెం, సరితక్లినిక్ సెంటర్, గట్టయ్యసెంటర్కు చెందిన విగ్రహాలు బస్డిపో, ఆర్అండ్బీ గెస్ట్హౌస్, మయూరిసెంటర్, కిన్నెరసెంటర్, జడ్పీసెంటర్, చర్చికాంపౌండ్, పటేల్టింబర్ డిపోమీదుగా ప్రకాష్నగర్ పాయింట్వద్దకు కాని, పటేల్ టింబర్ డిపో, గుట్టలబజార్, గాంధీచౌక్ మీదుగా నయాబజార్కు చేరుకోవాలి.
రోటరీనగర్, ఇందిరానగర్, వీడియోస్కాలనీ, నెహ్రూనగర్, బ్యాంకుకాలనీ, కవిరాజ్నగర్కు చెందిన విగ్రహాలను ఇల్లెందు క్రాస్రోడ్డు, జడ్పీసెంటర్, చర్చికాంపౌండ్ మీదుగా ప్రకాష్నగర్ మున్నేరుకు కానీ పటేల్ టింబర్డిపో, గుట్టలబజార్, గాంధీచౌక్ మీదుగా నయాబజార్కు చేరుకోవాలి.
యూపీహెచ్కాలనీ, ఖానాపురం, బల్లేపల్లి, బాలప్పేట విగ్రహాలు ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లెందుక్రాస్రోడ్, జడ్పీసెంటర్ చర్చికాంపౌండ్, పటేల్టింబర్ డిపోమీదుగా ప్రకాష్నగర్ కు కానీ పటేల్ టింబర్ డిపో , గుట్టలబజార్, గాంధీచౌక్ మీదుగా నయాబజార్కు చేరుకోవాలి.
సారధీనగర్, ఎఫ్సీఐ గోడౌన్స్, వెంకటేశ్వరనగర్ విగ్రహాలు నెహ్రూ విగ్రహం, జూబ్లీక్లబ్, తహసీల్దార్ ఆఫీసు, గాంధీచౌక్ మీదుగా నయాబజార్ చేరుకోవాలి
త్రీటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని విగ్రహాలన్నీ గాంధీచౌక్, పీఎస్ఆర్రోడ్, ట్రంక్రోడ్డు మీదుగా నయాబజార్ చేరుకోవాలి
తిరుగు ప్రయాణం, దారి మళ్లింపు ఇలా...
నిమజ్జనం పూర్తయిన వాహనాలన్నీ హిందూ శ్మశాన వాటిక, పిల్లిచిన్నకృష్ణయ్యతోట, త్రీటౌన్ పోలీసు స్టేషన్, పంపింగ్ వెల్రోడ్, బోస్బొమ్మసెంటర్, చర్చికాంపౌండ్ మీదుగా వెళ్లాలి. నిమజ్జనం సందర్భంగా 19న మధ్యాహ్నం 2గంటల నుంచి నాయుడుపేటనుండి వచ్చే అన్ని వాహనాలను ములకలపల్లి క్రాస్రోడ్డు, బైపాస్రోడ్డుమీదుగా ఖమ్మంటౌన్ లోకిఅనుమతిస్తారు. నగరంలో నుంచి హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లే వాహనాలను నెహ్రూ విగ్రహం , ఎఫ్సీఐ ద్వారా బైపాస్రోడ్డుమీదుగా పంపుతారు. నిమజ్జన సమయంలో విగ్రహాల వెంట చిన్నారులు వద్దు. విగ్రహం వెంట ఇద్దరు మాత్రమే వెళ్లాలి. మయూరిసెంటర్ బ్రిడ్జిపై గణేష్ వాహనాలను అనుమతిలేదు.