ఆసియా లెవెన్కు కోహ్లీ, ధవన్
ABN , First Publish Date - 2020-02-22T10:27:48+05:30 IST
వరల్డ్ లెవెన్తో జరిగే రెండు అంతర్జాతీయ టీ20ల్లో ఆసియా లెవెన్ నుంచి విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, షమి, కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు...
న్యూఢిల్లీ: వరల్డ్ లెవెన్తో జరిగే రెండు అంతర్జాతీయ టీ20ల్లో ఆసియా లెవెన్ నుంచి విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, షమి, కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వీరి పేర్లను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు పంపాడు. బంగ్లా జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ శత జయంతిని పురస్కరించుకుని ఢాకాలో వచ్చే నెల 18, 21తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. భారత ఆటగాళ్ల ప్రాతినిథ్యంపై అనుమానాలు నెలకొన్నా ఆసియా లెవెన్లో పాక్ ఆటగాళ్లెవరూ లేకపోవడంతో బోర్డు తమ క్రికెటర్లను పంపనుంది. మరోవైపు తమ ప్లేయర్స్ పాక్ సూపర్ లీగ్లో బిజీగా ఉండడంతోనే పంపలేకపోతున్నామని ఆ దేశ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.