పొరుగు రాష్ట్రం ఇవ్వనీ.. చూద్దాం!
ABN , First Publish Date - 2021-01-18T08:33:41+05:30 IST
కేంద్రానికి కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించే విషయమై రెండు తెలుగు రాష్ట్రాలు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. డీపీఆర్లు సమర్పించిన తర్వాత ఎదురయ్యే పరిణామాలపై కసరత్తు చేస్తున్నాయి.
డీపీఆర్లపై రెండు రాష్ట్రాల దోబూచులాట
తెలంగాణ డీపీఆర్లు సిద్ధం
ఏపీ వైఖరి వెల్లడైన తర్వాత
స్పందించాలని నిర్ణయం
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కేంద్రానికి కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించే విషయమై రెండు తెలుగు రాష్ట్రాలు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. డీపీఆర్లు సమర్పించిన తర్వాత ఎదురయ్యే పరిణామాలపై కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎవరు ముందు వీటిని సమర్పించాలనే అంశంపై తేల్చుకోలేకపోతున్నాయి. ఏపీ సమర్పించిన తర్వాత చుద్దామని తెలంగాణ భావిస్తుండగా, ఈ విషయంలో తెలంగాణ ఏలా స్పందిస్తుందో చూడాలనే ధోరణిలో ఏపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్లలో చేపట్టిన కొత్త ప్రాజెక్టులపై రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లు సమర్పించాలని రెండు రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అయితే, ఈ సమావేశం జరిగి మూడు నెలలు గడచినా.. డీపీఆర్ల సమర్పణకు ఏపీ, తెలంగాణ ముందుకురాలేదు. దీంతో కేంద్ర మంత్రి తాజాగా రెండు రాష్ట్రాలకు లేఖలు రాశారు. డీపీఆర్లపై ఆయన లేఖ రాయడం ఇది రెండో సారి.
అయితే, ఈ విషయమై రాష్ట్రాల అభిప్రాయం భిన్నంగా ఉంది. డీపీఆర్లు సమర్పించిన తర్వాత, సకాలంలో వాటికి కేంద్రం అనుమతులు ఇవ్వకపోతే ఎలా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. పైగా కేంద్రం కొర్రీలు వేస్తే... ఈ రుణాలు స్వీకరించడంలో సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో డీపీఆర్ల సమర్పణను వీలైనంత కాలం వాయిదా వేసే ధోరణిలో రెండు రాష్ట్రాలు ఉన్నట్టు తెలుస్తున్నది. కేంద్రం అడిగిన ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. కానీ, ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసిన తర్వాతే తుది నిర్ణయానికి రావాలని భావిస్తోంది. అదే విధంగా తెలంగాణ స్పందన కోసం ఏపీ ఎదురుచూస్తోంది.