బంగారం స్మగ్లింగ్‌కు దోహదం చేసిన ‘లాక్‌డౌన్’...

ABN , First Publish Date - 2021-12-05T20:59:19+05:30 IST

కరోనా కారణంగా... గతేడాది విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్... స్మగ్లర్లు కొత్తదారులు వెదుక్కునేలా చేసింది.

బంగారం స్మగ్లింగ్‌కు దోహదం చేసిన ‘లాక్‌డౌన్’...

హైదరాబాద్/ముంబై : కరోనా కారణంగా... గతేడాది విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్... స్మగ్లర్లు కొత్తదారులు వెదుక్కునేలా చేసింది. లాక్‌డౌన్ నేపధ్యంలో... విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు సహా దాదాపు రవాణా వ్యవస్థ అంతా స్థంభించిపోవడంతో... దొంగబంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చేందుకు... స్మగ్లర్లు కొత్త మార్గాలను వెదుక్కుంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల మీదుగా దేశంలోకి భారీగా బంగారాన్ని తరలిస్తున్నట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి. మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాల నుంచి మయన్మార్ మీదుగా బంగారాన్ని తీసుకొచ్చినట్లు ఇప్పటికే తేలింది. 


డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2020-21’ పేరుతో వెలువడిన డీఆర్ఐ నివేదికను కేంద్రం... విడుదల చేసింది. లాక్‌డౌన్‌లో భాగంగా వైమానిక మార్గాలను మూసివేయడంతో... స్మగ్లర్లు దొంగ బంగారాన్ని... మధ్య, తూర్పు ఆసియా దేశాల నుంచి మయన్మార్ మీదుగా రోడ్డు మార్గంలో దేశానికి తరలించినట్లు నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, ముంబై లక్ష్యంగా స్మగ్లింగ్‌లో భాగస్వామ్యులైన వారిలో మయన్మార్ దేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొంది. భారత్-మయన్మార్ మధ్య 1,643 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న విషయం తెలిసిందే. మణిపూర్, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లతో సరిహద్దులున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబై, హైదరాబాద్‌ లక్ష్యంగా పెద్దఎత్తున బంగారం స్మగ్లింగ్ చోటు చేసుకున్నట్లు ఈ నివేదికలో డీఆర్ఐ అధికారులు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-05T20:59:19+05:30 IST