పెళ్లికి ముఖం చాటేసిన యువకుడు.. యువతి బలవన్మరణం
ABN , First Publish Date - 2021-06-09T04:43:56+05:30 IST
ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు చివరకు ముఖం చాటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది.
ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఘటన
వైరా, జూన్ 8: ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు చివరకు ముఖం చాటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని విప్పలమడక గ్రామానికి చెందిన బూర్గు శారదా(28)ను విప్పలమడక సమీపంలోని గరికపాడు గ్రామానికి చెందిన వివాహితుడైన కోట ప్రవీణ్ ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శారద మంగళవారం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎంఎస్సీ చదివిన శారద హైదరాబాద్ షాపూర్లోని ఓ వాహన షోరూమ్లో ఉద్యోగం చేస్తోంది. గరికపాడు గ్రామానికి చెందిన కోట ప్రవీణ్ కూడా అదేప్రాంతంలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. అవకాశంగా తీసుకున్న ప్రవీణ్ పెళ్లిచేసుకుంటానని శారదను నమ్మించాడు. అప్పటికే ప్రవీణ్కు వివాహమై సంతానం కూడా ఉంది. అయితే లాక్డౌన్ కావడం షోరూంలను సక్రమంగా తెరవకపోతుండటంతో శారద స్వగ్రామానికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు యోహాన్, లూర్ధమ్మ సంబంధాలు చూస్తున్నారు. దీంతో శారద వెంటనే ప్రవీణ్కు ఫోన్ చేసి తనకు పెళ్లి ససంబంధాలు చూస్తున్నారని, తనను పెళ్లి చేసుకోవాలని కోరగా ప్రవీణ్ నిరాకరించాడు. దీంతో శారద బలవన్మరణానికి పాల్పడింది. అయితే మంగళవారం ఉదయం 10గంటల వరకు కూడా శారద ప్రవీణ్తో ఫోన్లో మాట్లాడినట్టుగా కాల్లిస్టు ద్వారా తెలుస్తోంది. శారద తండ్రి యోహాన్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పనికి వెళ్లగా, తల్లి లూర్దమ్మ గేదెలను మేత కోసం పొలానికి తోలుకు వెళ్లింది. ఇక ఆమె వదిన అపర్ణ ఈజీఎస్ పనికి వెళ్లగా.. ఎవరూ లేని సమయంలో శారద ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వదిన అపర్ణ పని నుంచి ఇంటికి వచ్చి చూడగా శారదా ఉరేసుకుని కనిపించింది. దాంతో తండ్రి యోహాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైరా ఎస్ఐ వి.సురేష్ సంఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు.