ఇష్టపడ్డారు.. ఒక్కటయ్యారు..

ABN , First Publish Date - 2021-04-09T05:20:30+05:30 IST

ఆ ఇద్దరూ అంధులు... వరుడేమో వాయిద్య కళాకారుడు.. వధువు గాయని.. కళ వారిని కలిపింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారి ప్రేమ ప్రయాణంలో వచ్చిన కొద్దిపాటి అవాంతరాన్ని అధిగమించి పెద్దల జోక్యంతో ఒక్కటయ్యారు. వేదమంత్రాల సాక్షిగా కుటుంబసభ్యులు, మిత్రులు, పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు ఆ అంధజంట.

ఇష్టపడ్డారు.. ఒక్కటయ్యారు..
దండలు మార్చుకుంటున్న క్రాంతికుమార్‌, శేషుకుమారి

అంధత్వాన్ని జయించి పెళ్లాడిన కళాకారుల జంట

కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం 

వైరా, ఏప్రిల్‌ 8: ఆ ఇద్దరూ అంధులు... వరుడేమో వాయిద్య కళాకారుడు.. వధువు గాయని.. కళ వారిని కలిపింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారి ప్రేమ ప్రయాణంలో వచ్చిన కొద్దిపాటి అవాంతరాన్ని అధిగమించి పెద్దల జోక్యంతో ఒక్కటయ్యారు. వేదమంత్రాల సాక్షిగా కుటుంబసభ్యులు, మిత్రులు, పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు ఆ అంధజంట. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామానికి చెందిన శ్రీరంగం శేషుకుమారికి ఏపీలోని కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన గుత్తా క్రాంతికుమార్‌ ఇద్దరూ అంధులు. శేషుకుమారి తండ్రి శ్రీరంగం వెంకటరమణ కొన్నేళ్ల కిందట మృతిచెందాడు. ఆతర్వాత తల్లి అనురాధ అన్నీతానే అయి అంధురాలైన కుమార్తె శేషుకుమారిని పెంచి పోషిస్తోంది. అయితే గాయకురాలిగా రాణిస్తున్న కుమార్తెకు అండగా ఉండి అంధులు నిర్వహించే గానకచేరీ బృందంలో చేర్చి పలుచోట్ల ప్రదర్శనలు ఇప్పిస్తూఉండేది. ఈక్రమంలో ఆ బృందంలో పనిచేస్తున్న వాయిద్య కళాకారుడిగా పనిచేస్తున్న క్రాంతికుమార్‌, శేషుకుమారి ఒకరినొకరు ఇష్టపడ్డారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వరుడి వైపువారి నుంచి ఈ వివాహానికి మొదట్లో అంగీకారం రాకపోవడంతో.. తాటిపూడి ఎంపీటీసీ అల్లిక కాటంరాజు, గ్రామపెద్దలు జోక్యం చేసుకొని వరుడు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ఒప్పించడంతో.. చివరికి ఆ అంధ కళాకారుల జంట ఒక్కటైంది. ఇరు కుటుంబాలతో పాటు బంధువులు, మిత్రులు, గ్రామస్థుల సమక్షంలో శేషుకుమారి, క్రాంతికుమార్‌ ఓ ఇంటివారవగా.. తాటిపూడిలో జరిగిన ఈ వివాహవేడుకకు వచ్చిన వారి కోసం ఎంపీటీసీ కాటంరాజు భోజన ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-04-09T05:20:30+05:30 IST