కల్యాణ రాముడికి మహదాశీర్వచనం
ABN , First Publish Date - 2020-04-05T10:37:02+05:30 IST
భద్రాద్రి కల్యాణ రాముడికి వేద మంత్రాలతో వేదపండితులు మహదాశీర్వచనం నిర్వహించారు. ఆలయ
భద్రాచలం, ఏప్రిల్ 4: భద్రాద్రి కల్యాణ రాముడికి వేద మంత్రాలతో వేదపండితులు మహదాశీర్వచనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నిత్యకల్యాణ వేదికవద్ద శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివాహం జరిగిన తరువాత నూతన వధూవరులైన శ్రీ సీతారామచంద్రస్వామికి వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వడమే సదస్యం పరమార్ధం.
సదస్యం ముఖ్య ఉద్దేశ్యం సీతారాముల కల్యాణ క్రతవులో పాల్గొని తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తారు. కల్యాణం జరిగిన మూడో రోజున స్వామి వారికి మహదాశీర్వచనం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా కల్యాణ మూర్తులను నిత్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలతో స్వామి వారికి మహదాశీర్వచనం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానాచార్యుల స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, అర్చకులు, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.