భార్య, అత్తను చంపి.. పిల్లల ఎదుటే శరీర భాగాలను...

ABN , First Publish Date - 2021-01-12T21:13:55+05:30 IST

పిల్లల ఏడుపుతో ఉలిక్కిపడిన ఇరుగుపొరుగు వారు వెళ్లి అక్కడి దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు.

భార్య, అత్తను చంపి.. పిల్లల ఎదుటే శరీర భాగాలను...

అగర్తల: త్రిపురలోని ధలాయ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, ఆమె తల్లిని చంపి పిల్లల ఎదురుగానే వారి శరీర భాగాలను చెక్కేశాడు. ఇది చూసిన పిల్లలు షాక్‌లోకి వెళ్లిపోయారు. అనంతరం నిందితుడు అక్కడే విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పిల్లల ఏడుపుతో ఉలిక్కిపడిన ఇరుగుపొరుగు వారు వెళ్లి అక్కడి దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లీ కూతుళ్లను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  


పోలీసులు వచ్చేసరికి నిందితుడు మరో గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. నిందితుడిది పశ్చిమ త్రిపురలోని హపానియాగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించామని, శరీరంలో విషపు ఆనవాళ్లను గుర్తించామని పోలీసులు తెలిపారు. అయితే, ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నించే పరిస్థితి లేకపోవడంతో ఘటనకు గల కారణం తెలియరాలేదని సబ్‌ డివిజనల్ పోలీసు అధికారి ఆశిష్ దాస్‌గుప్తా తెలిపారు. నిందితుడికి ప్రస్తుతం అగర్తలలోని జీబీపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.  


బాధిత చిన్నారులను ధలాయ్ శిశు సంరక్షణ అధికారికి అప్పగించారు. నిందితుడి భార్య, పిల్లలతో కలిసి నాలుగు నెలలుగా అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా విడాకులు తీసుకునే పనిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. హత్యలకు ఇదే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, దర్యాప్తు తర్వాత కానీ ఏ విషయమూ చెప్పలేమన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.  

Updated Date - 2021-01-12T21:13:55+05:30 IST