అనుమానంతో భార్యను చంపిన భర్త

ABN , First Publish Date - 2020-08-09T07:54:15+05:30 IST

అనుమానం పెనుభూతమైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఇప్పటికే కన్న తండ్రిని మట్టుబెట్టిన అతడిలో కసాయితనం మాత్రం చావలేదు...

అనుమానంతో భార్యను చంపిన భర్త

  • తండ్రితో వివాహేతర సంబంధం ఉందని అనుమానం
  • 4 నెలల కిందట తండ్రినీ చంపిన దుర్మార్గుడు

పెన్‌పహాడ్‌, ఆగస్టు 8: అనుమానం పెనుభూతమైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఇప్పటికే కన్న తండ్రిని మట్టుబెట్టిన అతడిలో కసాయితనం మాత్రం చావలేదు. తండ్రి హత్య కేసులో జైలుకెళ్లి వచ్చినా అతడి బుద్ధిలో ఏ మార్పూ రాలేదు.  కలకాలం కలిసుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి తాళి కట్టిన ఆలిని సైతం అదే అనుమానంతో హతమార్చాడా దుర్మార్గుడు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం జల్మాల్‌కుంట తండాలో జరిగిందీ దారుణం.


నూనావత్‌ స్వామి, సరోజ(36) దంపతులు. భార్యపై అనుమానం పెంచుకున్న స్వామి.. శుక్రవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సరోజపై గొడ్డలితో తల వెనకభాగంపై బలంగా మోదాడు. ఈ హఠాత్‌ పరిణామంతో ఒక్కసారిగా భయపడిపోయిన సరోజ.. తనను కాపాడాలంటూ పెద్దపెట్టున రోదించింది. ఈ వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఆమె అరుపులు విని మేల్కొన్న ఇరుగుపొరుగువారు.. వెంటనే స్వామి ఇంటికి పరుగెత్తారు. రక్తపుమడుగులో ఉన్న ఆమెను చూసి 108కు సమాచారమిచ్చారు. వాహనంలో ఆమెను సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సరోజ మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా, తన తండ్రి నూనావత్‌ బీక్యాతో సరోజకు వివాహేతర సంబంధం ఉందని స్వామి అనుమానించేవాడు. అదే కారణంతో మార్చి 28వ తేదీన తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ హత్య కేసులో జైలుకు వెళ్లిన స్వామి 10 రోజుల కిందట బెయిల్‌పై వచ్చాడు. అతడు ఇంటికి వచ్చిన రోజు నుంచీ భార్యతో తరుచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో భార్యను హత్య చేశాడు. స్వామి-సరోజ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిందితుడిని పోలీసులు అదువులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరుడు ధీరావత్‌ శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2020-08-09T07:54:15+05:30 IST