కర్ఫ్యూకు ప్రతీ ఒక్కరు సహకరించాలని
ABN , First Publish Date - 2021-04-21T05:35:34+05:30 IST
కర్ఫ్యూకు ప్రతీ ఒక్కరు సహకరించాలని
ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
మహబూబాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : కరోనా సేకండ్ వేవ్లో పాజిటివ్ల సంఖ్య పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుతం అమలు చేస్తున్న కర్ఫ్యూకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభించి కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రతీ ఒక్కరు మాస్క్లు తప్పనిసరిగా ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలన్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేస్తున్న కర్ఫ్యూకు సహాకరించాలని కోరారు. ఈ కర్ఫ్యూ ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందన్నారు. కర్ఫ్యూను ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు కంపెనీలు, షాపింగ్మాల్స్, రెస్టారెంట్లు రాత్రి 8 గంటల్లోపే మూసివేయాలని చెప్పారు. రాత్రి 9 గంటల తర్వాత తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో ఎమర్జెన్సీ సర్వీసులు, పెట్రోల్ బంకులు, మీడియాకు ఈకర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. కర్ఫ్యూ సమయంలో మినహాయించిన ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, మీడి యా ప్రతినిధులు తప్పనిసరిగా ఐడీ కార్డులు కలిగి ఉండాలని సూచించారు. అదే సమయంలో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లే ప్రయాణికులు వాల్యూడ్ టికెట్ను చూపించాలన్నారు. అంతరాష్ట్ర సర్వీసులు, రాష్ట్ర సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, ఉద్యోగులు అన్ని వర్గాల వారు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.