ఎస్బీఐ నుంచి సూక్ష్మ రుణాలు
ABN , First Publish Date - 2020-05-31T06:35:37+05:30 IST
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. సూక్ష్మ రుణ వ్యాపారంలోకి ప్రవేశించబోతోంది. ఇందుకోసం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ మైక్రో మార్కెట్ (ఎ్ఫఐఎంఎం) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు...
- ఎఫ్ఐఎంఎం పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు
- జూన్ 1 నుంచి సేవలు ప్రారంభం
హైదరాబాద్: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. సూక్ష్మ రుణ వ్యాపారంలోకి ప్రవేశించబోతోంది. ఇందుకోసం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ మైక్రో మార్కెట్ (ఎ్ఫఐఎంఎం) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా సూక్ష్మ రుణాల మార్కెట్, వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలపై ప్రత్యేక దృష్టిసారించనుంది. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఎఫ్ఐఎంఎం విభాగ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. తెలంగాణలోనూ ఎఫ్ఐఎంఎం నెట్వర్క్ను జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
మైక్రో ఫైనాన్స్ వ్యాపారంలోకి ప్రవేశించబోతున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ. కరోనా సంక్షోభాన్ని కూడా తట్టుకోగలిగిన అతికొద్ది రంగాల్లో మైక్రోఫైనాన్స్ ఒకటి. దేశంలో సూక్ష్మ రుణాల మార్కెట్ రూ.2.2 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. అందులో నాలుగో వంతు మార్కెట్ వాటా కోల్కతాకు చెందిన బంధన్ బ్యాంకుదే. ప్రస్తుతం బంధన్ బ్యాంక్ సూక్ష్మ రుణాలపై దాదాపు 18 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 20 శాతం పైగా వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎస్బీఐ వీటికంటే తక్కువ వడ్డీ రేటుకే సూక్ష్మ రుణాలు అందించనున్నట్లు తెలుస్తున్నది.
ఎస్ఎంఈ విభాగం పునరుద్ధరణ
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరింత వేగంగా రుణాలందించేందుకు ఎస్ఎంఈ విభాగాన్ని పునరుద్ధరించినట్లు ఓపీ మిశ్రా వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్, నల్లగొండ, వరంగల్లో ప్రత్యేక ఎస్ఎంఈ సెల్స్ను ఏర్పాటు చేశామన్నారు. ఎస్బీఐకి తెలంగాణలో 54 ఎస్ఎంఈ ఇంటెన్సివ్ బ్రాంచ్లున్నాయి.
ఎంఎ్సఎంఈలకు అండగా..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఎంఎ్సఎంఈ, ముద్ర రుణగ్రహీతలకు ఎలాంటి హామీ అవసరం లేకుండా రుణాలందిస్తున్నట్లు మిశ్రా తెలిపారు. నాలుగేళ్ల కాలపరిమితితో కూడిన ఈ రుణాలపై 12 నెలల పాటు మారటోరియం (తిరిగి చెల్లింపులకు విరామం) లభిస్తుంది.