చౌక విద్యుత్పై దృష్టి పెట్టండి
ABN , First Publish Date - 2020-06-01T08:53:29+05:30 IST
చౌకగా లభ్యమయ్యే విద్యుత్పై దృష్టి పెట్టాలని, అలాంటి విద్యుత్కు ఏపీని కేంద్రస్థానంగా మలచాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను కోరింది.
విద్యుత్ సంస్థలకు ప్రభుత్వ ఆదేశం
ధరలు తగ్గడంతో 700 కోట్లు ఆదా
వాడకం మేరకే వినియోగదారులకు బిల్లులు
సకాలంలో చెల్లించి సహకరించండి: మంత్రి బాలినేని
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): చౌకగా లభ్యమయ్యే విద్యుత్పై దృష్టి పెట్టాలని, అలాంటి విద్యుత్కు ఏపీని కేంద్రస్థానంగా మలచాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను కోరింది. దీనివల్ల వినియోగదారులపై భారం తగ్గించడం వీలవుతుందని ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఆ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం 18.5 లక్షల మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ను వచ్చే రబీ సీజన్ నుంచి పూర్తిగా పగటిపూట ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికి 81 శాతం ఫీడర్లలో రోజుకు 9 గంటలు పగటిపూట కరెంటు ఇస్తున్నామని, మిగిలిన ఫీడర్లలో కూడా రబీ సీజన్ నాటికి ఇస్తామని చెప్పా రు. దీనికి అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్లు, లైన్ల ఆధునీకరణకు రూ.1,700 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
వాడకం మేరకే విద్యుత్ బిల్లులు వస్తున్నాయని, వినియోగదారులపై ఎక్కడా అదనపు భారం వేయలేదని చెప్పారు. గృహ వినియోగదారులకు రూ.1,707 కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి విద్యుత్ సంస్థలకు అండగా నిలవాలని కోరారు. కాగా, దేశవ్యాప్తంగా విద్యుత్ ధరలు తగ్గిన పరిణామాన్ని ఆసరాగా తీసుకొని సరైన వ్యూహంతో వెళ్లడంతో ఇటీవలి కాలంలో విద్యుత్ కొనుగోళ్లలో రూ.700 కోట్లు ఆదా చేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ చెప్పారు. గత ఆరేళ్లలో ఇంత ఆదా కావడం ఇదే ప్రథమమన్నారు.