మంత్రి మనుమడి ర్యాగింగ్
ABN , First Publish Date - 2021-03-08T08:23:24+05:30 IST
రాష్ట్ర సీనియర్ మంత్రి మనుమడిపై ర్యాగింగ్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబరు 3లో ఉన్న ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజీలో మంత్రి మనమడు చదువుతున్నాడు.
- తమను కొట్టాడని పోలీసులకు విద్యార్థుల ఫిర్యాదు
- అయినా కేసు నమోదు చేయలేదు
- ఎలాంటి ఫిర్యాదూ రాలేదు: పోలీసులు
పంజాగుట్ట, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సీనియర్ మంత్రి మనుమడిపై ర్యాగింగ్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబరు 3లో ఉన్న ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజీలో మంత్రి మనమడు చదువుతున్నాడు. కళాశాలలో ఆ యువకుడు తమపై దాడి చేశాడని పంజాగుట్ట పోలీసులకు కొంత మంది విద్యార్థులు శనివారం ఫిర్యాదు చేశారు. అతడి వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేశామని బాధిత యువకులు పేర్కొన్నారు. తాను మంత్రి మనుమడిని అని బెదిరించాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేయని పంజాగుట్ట పోలీసులు.. జనరల్ డైరీలో మాత్రమే ఫిర్యాదు రాసి బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు సమాచారం. ఈ ఘటన గురించి పంజాగుట్ట పోలీసులను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం ప్రకారం శనివారం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు కూడా తెలిసింది. ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే సమాచారం అందడంతో పోలీసులు ఆ కళాశాలకు వెళ్లారు. ఈ విషయమై పంజాగుట్ట ఏసీపీ పీవీ గణేశ్, పంజాగుట్ట పోలీసు అధికారులను అడిగేతే తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు.