బల్దియా అధికారుల నిర్లక్ష్యాన్నిసహించేది లేదు: కేటీఆర్
ABN , First Publish Date - 2021-06-18T00:06:10+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రామ్(సీఆర్ఎంపి) కింద ఏర్పాటు చేసిన రోడ్డుపై మ్యాన్హోల్ లేని ఉదంతంపై తక్షణమే భాద్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్వింద్ కుమార్ విచారణకు ఆదేశించారు. ఆ మేరకు అందుకు బాధ్యులైన అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ)ఎం.రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ మహ్మద్ యూసుఫ్లపై సస్పెన్షన్ వేటు పడింది. వీరి పై అధికారులైన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(బేగంపేట్) ఆర్.శివానంద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(బేగంపేట్) టి.ఎస్.ఆర్.ఆంజనేయులులకు వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ మెమోలు జారీ చేశారు.
ఇదిలాఉండగా, పద్మారావునగర్ మెయిన్ రోడ్డును కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రామ్(సీఆర్ఎంపి) బాధ్యతలు నిర్వహిస్తున్న మెసర్స్ కె.ఎన్.ఆర్.కన్స్ట్రక్షన్స్కు జీహెచ్ఎంసీ యంత్రాంగం రూ.లక్ష పెనాల్టీ విధించింది.