ఆయిల్పామ్ రైతులకు లాభసాటి సాగు- మంత్రి పువ్వాడ
ABN , First Publish Date - 2020-08-02T20:09:39+05:30 IST
తెలంగాణలో ఆయిల్పామ్సాగు రైతులకు లాభసాటిగా ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ఖమ్మం: తెలంగాణలో ఆయిల్పామ్సాగు రైతులకు లాభసాటిగా ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు అందిస్తోందన్నారు. మొక్కలు, ఎరువులు, డ్రిప్లపైన రాయితీలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకుని ఆయిల్పామ్సాగు వైపు రైతులు మొగ్గుచూపాలని అన్నారు. పామాయిల్ సాగును ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అశ్వారావుపేట, దమ్మపేటలో పామాయిల్ఫ్యాక్టరీ నిర్మాణాలు, తోటల విస్తరణ జరిగిందన్నారు. భద్రాద్రి జిల్లాలో 33,812 ఎకరాలు, ఖమ్మంలో 6,845 ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా 40,872 ఎకరాల్లో పామాయిల్ సాగవుతోందని మంత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం అప్పారావుపేట గ్రామంలోని పామాయిల్ ఫ్యాక్టరీని మంత్రి అజయ్కుమార్ సందర్శించారు.
వివిధ విభాగాలను ఆయన తిరిగి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుతో రైతుల భవిష్యత్ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. దేశంలో నూనె ఉత్పత్తులలోటు ఉందని, ఆయిల్ఫెడ్ ద్వారా తోటలు వేయించడం, మార్కెటింగ్, చెల్లింపులు, రవాణా చార్జీలు , క్రషింగ్ , విజయాఆయిల్ ద్వారా నూనెను తిరిగి అమ్మడం ఆయిల్ఫెడ్ ద్వారా జరుగుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ విస్తరించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
పామాయిల్ తోటలు వేసిన వారికి ఉద్యానవనం, ఆయిల్ఫెడ్ సహకారం అందిస్తుందనిఅన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టిఎస్ ఆయిల్ఫెడ్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండి నిర్మల తదితరులు పాల్గొన్నారు.