మంత్రగాడనే నెపంతో వృద్ధుడి హత్య

ABN , First Publish Date - 2021-06-09T04:42:32+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధి కొత్తమారేడుబాకలో గత నెల 12న మాయమైన వృద్ధుడి మిస్టరీ ఎట్టకేలకు మంగళవారం వీడింది.

మంత్రగాడనే నెపంతో వృద్ధుడి హత్య
సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ, తహసీల్దార్‌

నలుగురు నిందితుల రిమాండ్‌

దుమ్ముగూడెం, జూన్‌ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధి కొత్తమారేడుబాకలో గత నెల 12న మాయమైన వృద్ధుడి మిస్టరీ ఎట్టకేలకు మంగళవారం వీడింది. మంత్రాలు, చేతబడులతో కొందరి చావుకు, మరి కొందరి అనారోగ్యానికి కారణమయ్యాడనే నెపంతో కుంజా భీమయ్య(65)ను స్థానికులే హత్య చేసి నరసాపురం గోదావరి ఒడ్డున పూడ్చిపెట్టిన విషయం వెలుగు చూసింది. సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకా రం.. కెమారేడుబాకకు చెందిన తెల్లం శ్రీను, కుంజా లక్ష్మీనారాయణ, తెల్లం రాజారావు, మిడియం శ్రీను మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. అనంతరం వారు కుంజా భీమయ్యను హత్య చేసిన తీరును వెల్లడించారు. తెల్లం శ్రీను భార్య అనారోగ్యానికి గురయింది. మిడియం శ్రీను తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. లక్ష్మీనారాయణ కొడుకు డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. రాజారావు తల్లి అనారోగ్యానికి గురయింది. ఈ ఘటనలన్నింటికీ కుంజా భీమయ్య మంత్రాలు, చేతబడులే కారణమని అతడిపై వారంతా కోపం పెంచుకున్నారు. ఎలాగైనా చంపాలనే ఉద్దేశ్యంతో ఒక పఽథకం ప్రకారం ఈనెల 12న అర్థరాత్రి భీమయ్యను తాడుతో మెడకు ఉరివేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మోసుకు వచ్చి నరసాపురం గోదావరి నది ఇసుకలో గొయ్యి తవ్వి పూడ్చారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకొన్న సీఐ, శవాన్ని పూడ్చిన స్థలం వద్దకు వారిని తీసుకొని వెళ్లి ప్రదేశాన్ని గుర్తించారు. తహసీల్దార్‌ రవికుమార్‌ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి శవ పంచనామా నిర్వహించారు. హత్యకు పాల్పడిన నిందితులు తెల్లం శ్రీను, కుంజా లక్ష్మీనారాయణ, తెల్లం రాజారావు, మిడియం శ్రీనుపై సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మూఢ నమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ సూచించారు. 


Updated Date - 2021-06-09T04:42:32+05:30 IST