నీలంతో పోలుస్తూ జగన్ సర్కార్కు చంద్రబాబు చురకలు
ABN , First Publish Date - 2020-06-01T23:17:06+05:30 IST
భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డితో పోలుస్తూ జగన్ సర్కార్కు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చురకలు అంటించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డితో పోలుస్తూ జగన్ సర్కార్కు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చురకలు అంటించారు. నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్న ఆయన.. నీలం పాటించిన విలువల గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సీఎంగా ఉన్నప్పుడు హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించి పదవినే వదిలేసిన సంజీవరెడ్డి... తాను లోక్సభ సభాపతిగా ఎన్నిక కాగానే, నిస్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి విలువలకు పట్టం కట్టారన్నారు. కాబట్టే భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, కానీ ఈనాడు గౌరవ పదవుల్లో ఉన్నవారు కోర్టులు ఒకసారి కాదు 65సార్లు తప్పుపట్టినా దులిపేసుకోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. కోర్టుల వ్యాఖ్యలనే కాదు, తీర్పులను లెక్కపెట్టని పెడ ధోరణి చూస్తున్నామన్నారు. పైగా కోర్టులకే దురుద్దేశాలు ఆపాదించే హీనానికి దిగజారడం బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘నీలం’ లాంటి నాయకుల స్మృతులను మననం చేసుకోవాల్సిన సందర్భం ఇదని ట్వీట్ చేశారు.