నిందితుడు ఎక్కడ మంత్రి గారు?
ABN , First Publish Date - 2021-09-15T09:26:33+05:30 IST
ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రకటిస్తుండగా.. అతణ్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారంటూ
- మంత్రి కేటీఆర్పై నెటిజన్ల ఫైర్
- అతణ్ని ఎప్పుడు అరెస్టు చేశారు?
- తప్పుడు సమాచారంతోనే ట్వీట్
- విచారం వ్యక్తం చేసిన కేటీఆర్
హౖదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రకటిస్తుండగా.. అతణ్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారంటూ ఈ నెల 12నే మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం వివాదంగా మారింది. ‘‘నిందితుడు ఎక్కడ మంత్రిగారూ? అతడిని ఎప్పుడు అరెస్ట్ చేశారు?’’ అంటూ నెటిజన్లు సోషల్మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించిన కేటీఆర్కు మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కూడా కేటీఆర్ ట్వీట్ను తప్పుబట్టారు. నిందితుణ్ని గంటల్లో పట్టుకున్నామని కేటీఆర్ ట్వీట్ చేస్తే.. ఆచూకీ తెలిపినవారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారని.. ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ విమర్శలపై కేటీఆర్ మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించారు. నిందితుడి అరెస్టుపై తనకు తప్పుడు సమాచారం వచ్చిందని, దాని ఆధారంగా ట్వీట్ చేశానని విచారం వ్యక్తం చేశారు. అతడు ఇంకా పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున గాలిస్తున్నారని తెలిపారు. నిందితుణ్ని త్వరగా పట్టుకుని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అందరం కృషి చేద్దామని పేర్కొన్నారు.