కార్లు కొంటున్నారు...!
ABN , First Publish Date - 2020-08-03T07:55:50+05:30 IST
కొవిడ్-19 నేపథ్యంలో తొలిసారి కారు కొనుగోలు చేసే వారితో పాటు అదనంగా మరో కారును కొనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్సఐ) వెల్లడించింది.
- తొలిసారి కారు కొనే వారి సంఖ్య పెరుగుతోంది..
- మారుతి సుజుకీ ఈడీ శశాంక్ శ్రీవాత్సవ వెల్లడి
న్యూఢిల్లీ: కొవిడ్-19 నేపథ్యంలో తొలిసారి కారు కొనుగోలు చేసే వారితో పాటు అదనంగా మరో కారును కొనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్సఐ) వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా వినియోగదారులు.. వ్యక్తిగత రవాణా సాధనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని ఎంఎ్సఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఇందులో కూడా మొదటిసారి కారును కొనుగోలు చేసే వారి శాతం పెరిగిందని, ఇందుకు జూలై నెలలోని విక్రయాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో రీప్లే్సమెంట్ (ఎక్స్ఛేంజ్) కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయన్నారు. మరోవైపు ఇప్పటికే కారు ఉన్న వినియోగదారులు అదనంగా మరో కారును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కొవిడ్-19 కారణంగా ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించుకోవటం కన్నా వ్యక్తిగత వాహనాలను ఉపయోగించటం మేలని అభిప్రాయపడుతున్నారని, దీంతో ప్యాసింజర్ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందని శ్రీవాత్సవ తెలిపారు. కరోనా దెబ్బకు ప్రజల ఆదాయ స్థాయిల్లో కొంతమేర మార్పులు రావటంతో వారిపై ఒత్తిడి పడటంతో ఇది డిమాండ్పై ప్రభావం చూపిస్తోందన్నారు.
53 శాతం మంది కొత్తవారే : గత ఆర్థిక సంవత్సరం జూన్తో త్రైమాసిక కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటిసారి కారు కొనుగోలు చేసిన వారి వాటా 5.5 శాతం పెరిగి 51-53 శాతానికి చేరుకుందని మారుతి సుజుకీ తెలిపింది. ఇదే సమయంలో ఎంక్వైరీలు కూడా కొవిడ్ ముందున్న స్థాయిల్లో 85-90 శాతానికి చేరుకున్నాయని పేర్కొంది. ఈ ఎంక్వైరీల్లో 65 శాతం మినీ, కాంపాక్ట్ విభాగాల కార్ల కోసం చేసినవే ఉన్నాయని పేర్కొంది.