డ్రగ్స్ కేసుపై డీజీపీ ఎలా క్లీన్ చిట్ ఇచ్చారు: ధూళిపాళ్ల నరేంద్ర

ABN , First Publish Date - 2021-10-13T01:07:49+05:30 IST

హెరాయిన్ కేసులో రాష్ట్రానికి సంబంధం లేదని బ్లూ మీడియా తప్పుదారి పట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. ఎన్ఐఎ తాజాగా..

డ్రగ్స్ కేసుపై డీజీపీ ఎలా క్లీన్ చిట్ ఇచ్చారు: ధూళిపాళ్ల నరేంద్ర

గుంటూరు: హెరాయిన్ కేసులో  రాష్ట్రానికి సంబంధం లేదని బ్లూ మీడియా తప్పుదారి పట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్  అన్నారు. ఎన్ఐఎ తాజాగా విడుదల చేసిన పత్రికాప్రకటనలో టాల్కమ్ పౌడర్ పేరుతో దిగుమతి అయిన హెరాయిన్‌కు సంబంధించి విజయవాడతోపాటు చెన్నయ్, కోయంబత్తూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. డ్రగ్స్ కేసుపై డీఆర్ఐ విచారణ జరుపుతున్న సమయంలో రాష్ట్రానికి సంబంధం లేదని డీజీపీ ఎలా క్లీన్ చిట్ ఇచ్చారని ధూలిపాళ్ల ప్రశ్నించారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీతో గత ఏడాది కాలంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆ సంస్థ పేరుతో సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ సమర్పించిన మాట వాస్తవం కాదా? అని ఆయన నిలదీశారు.


‘‘జూన్‌లో ఇదే కంపెనీ పేరుతో 1.75 లక్షల కోట్ల విలువైన హెరాయిన్ దిగుమతి అయినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన డ్రగ్ మాఫియాలో ఉన్నవారు ఎవరైనా కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదు. నిజా నిజాలు వెలికితీసి డ్రగ్ మాఫియాలో ఉన్న పెద్ద తలకాయలు ఎంతటివారైనా బయటకు తీసి వారి నిజస్వరూపాన్ని దేశప్రజలకు వెల్లడించాల్సిందిగా ఎన్ఐఎ‌కు తెలుగుదేశం పార్టీ విజ్జప్తి చేస్తోంది.’’ అని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-13T01:07:49+05:30 IST