UAE flight suspensions: భారత్ సహా తొమ్మిది దేశాలపై బ్యాన్.. మినహాయింపులివే!
ABN , First Publish Date - 2021-06-12T17:18:35+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యూఏఈ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారత్ సహా తొమ్మిది దేశాల విమాన సర్వీసులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
భారత్ సహా 9దేశాల విమాన సర్వీసులపై యూఏఈ బ్యాన్!
అబుధాబి: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యూఏఈ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారత్ సహా తొమ్మిది దేశాల విమాన సర్వీసులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో భారత్, వియత్నాం, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, జాంబియా, డీఆర్ కాంగో, ఉగాండా ఉన్నాయి. ఈ హైరిస్క్ దేశాలకు యూఏఈకి చెందిన ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్వేస్ విమానయాన సంస్థలు విమాన సర్వీసులు నడపబోమని ప్రకటించాయి. యూఏఈ ఆయా దేశాలకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విమాన సర్వీసులను బ్యాన్ చేసింది, అలాగే ఆయా దేశాల నుంచి తమ దేశానికి ప్రయాణించడానికి ఎవరికి మినహాయింపు ఇచ్చిందనేది ఇప్పుడు ఒకసారి మనం చుద్దాం..
1. వియత్నాం
జూన్ 5న రాత్రి 11.59 గంటల నుంచి వియత్నాంకు విమాన రాకపోకలపై యూఏఈ బ్యాన్ విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది. అయితే, వియత్నా నుంచి యూఏఈ రావడానికి కొందరికి మినహాయింపు ఉంది.
* యూఏఈ పౌరులు, వారి సమీప బంధువులు
* ఇరు దేశాలకు చెందిన దౌత్తవేత్తలు
* యూఏఈ గోల్డెన్, సిల్వర్ వీసాదారులు
* ప్రత్యేక అనుమతులు ఉన్నవారు
* ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదించిన కరోనా వ్యాక్సిన్లను రెండు డోసులు తీసుకున్నవారు. వీరు టీకా తీసుకుని 28 రోజులు పూర్తై ఉండాలి.
2. భారత్
యూఏఈకి చెందిన ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్వేస్ విమానయాన సంస్థలు భారత్కు జూలై 6 వరకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించాయి. అలాగే ఇండియా నుంచి వచ్చే విమాన సర్వీసులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని యూఏఈ ప్రకటించింది. ఇక ఏప్రిల్ 24 నుంచే భారత విమాన సర్వీసులపై బ్యాన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, భారత్ నుంచి యూఏఈ వెళ్లేందుకు యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యవేత్తలు, ప్రత్యేక అనుమతి ఉన్నవారికి మినహాయింపు ఉంది.
3. బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక
ఈ మూడు దేశాల విమాన సర్వీసులపై యూఏఈ మే 12వ తేదీ (రాత్రి 11.59 గంటలు) నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్యాన్ వేసింది. అలాగే గత 14 రోజులలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ద్వారా కనెక్ట్ అయిన ప్రయాణీకులను మరే ఇతర ప్రదేశం నుండి యూఏఈకి ప్రయాణించడానికి అంగీకరించరు. ఈ మూడు దేశాల్లోని యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యవేత్తలకు మినహాయింపు ఇచ్చింది.
4. దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా నుండి ఎమిరేట్స్ మరియు ఎతిహాద్ విమానాలు మే 5 నుండి జూన్ 30 వరకు నిలిపివేయబడ్డాయి. గత 14 రోజులలో దక్షిణాఫ్రికాకు వెళ్లిన లేదా కనెక్ట్ అయిన వారికి యూఏఈకి వెళ్లే ఏ విమానాలలోనూ అనుమతి ఉండదు. కాగా, జోహన్నెస్బర్గ్కు ఎమిరేట్స్ రోజువారీ ప్యాసెంజర్ విమానాలు EK763 వలే పనిచేస్తాయి. అయితే EK764లో అవుట్బౌండ్ ప్యాసెంజర్ సర్వీసులు నిలిపివేయబడ్డాయి.
5. జాంబియా, డీఆర్ కాంగో, ఉగాండా
జూన్ 11 నుండి జాంబియా, డీఆర్ కాంగో, ఉగాండా నుండి ప్రయాణికుల రాకను నిషేధిస్తున్నట్లు యూఏఈ అధికారులు బుధవారం ప్రకటించారు. యూఏఈ పౌరులు, వారి మొదటి-డిగ్రీ బంధువులు, దౌత్యవేత్తలు, యూఏఈ గోల్డెన్, సిల్వర్ వీసాదారులకు మినహాయింపు ఉంది. అలాగే ఈ మూడు దేశాల నుండి ఇతర దేశాల గుండా వచ్చే ప్రయాణికులు యూఏఈలోకి ప్రవేశించడానికి అనుమతి పొందాలంటే ఆయా దేశాల్లో 14 రోజుల కంటే తక్కువగా స్టే చేసినట్లు ధ్రువీకరించే పత్రాలను చూపించాల్సి ఉంటుంది