శ్రీరామాయణంలో నవ విధ భక్తులు

ABN , First Publish Date - 2020-06-27T07:44:35+05:30 IST

శ్రవణం, కీర్తనం అంటూ నవ విధ భక్తి మార్గాలను గురించి ప్రహ్లాదుడు చెప్పిన మాటలు శ్రీమద్భాగవతంలో మనకు కనిపిస్తాయి. అవి లోక ప్రసిద్ధమై నిలిచాయి. అయితే, ప్రహ్లాదుడు చెప్పిన

శ్రీరామాయణంలో నవ విధ భక్తులు

శ్రవణం, కీర్తనం అంటూ నవ విధ భక్తి మార్గాలను గురించి ప్రహ్లాదుడు చెప్పిన మాటలు శ్రీమద్భాగవతంలో మనకు కనిపిస్తాయి. అవి లోక ప్రసిద్ధమై నిలిచాయి. అయితే, ప్రహ్లాదుడు చెప్పిన భక్తి లక్షణాలను కలిగి ఉన్న తొమ్మిది మంది భక్తులు రామాయణంలోనూ దర్శనమిస్తారు. 

ధన్యో రామకథా శ్రుతౌ చ హనుమాన్‌, వల్మీక భూః కీర్తనే

సీతా సంస్మరణే తథైవ భరతః శ్రీ పాదుకా సేవనే

పూజాయాం శబరీ, ప్రణామ కరణే లంకాధిపో, లక్ష్మణే

దాస్యే, సఖ్య కృతేర్కజః తనూ పరిత్యాగే జటాయుర్నవ

అనే పద్యం ప్రకారం ఆ తొమ్మిది మంది భక్తులూ వరుసగా.. హనుమంతుడు, వాల్మీకి మహర్షి, సీతమ్మ తల్లి, భరతుడు, శబరి, విభీషణుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, జటాయువు. వీరిలో హనుమంతుడు శ్రవణభక్తుడు. శ్రీరాముని చరితామృతాన్ని, రామనామాన్ని వినడంయందే ఆయనకు ఆసక్తి. లోకంలో శ్రీరామ కథ వ్యాపించి ఉన్నంతవరకూ తాను కూడా జీవించి ఉండేట్లు వరాన్ని పొందాడు. అందుకే ఇప్పటికీ ఎక్కడ రామనామ జపం జరిగినా అక్కడికి హనుమ ఏదో ఒక రూపంలో వస్తాడంటారు. ఎక్కడెక్కడ రఘునాథుని చరితం కీర్తింపబడుతుందో అక్కడికి చేరుకుని రెండు చేతులనూ జోడించి, శిరస్సుపైకి చేర్చి ఆనందాశ్రునయనాలతో రామకథను వింటాడని ప్రసిద్ధి. ఇక, వాల్మీకి మహర్షి.. కీర్తన భక్తుడు. నారదుని ఉపదేశంతో, బ్రహ్మదేవుని వరంతో.. తానెరిగిన శ్రీరామ తత్వాన్ని 24 వేల శ్లోకాల్లో శ్రీరామాయణంగా ఆ మహర్షి లోకానికి అందించాడు. రామాయణాన్ని కుశలవులకు ఉపదేశించి, వారిచే అశ్వమేధ యాగ సందర్భంలో పాడించి లోకంలో శ్రీరామయణాన్ని విస్తరింపజేసి కీర్తన భక్తుడిగా వాల్మీకి మహర్షి ప్రసిద్ధుడయ్యాడు. సీతా సాధ్వీమణి.. స్మరణ భక్తురాలు. రామునికి దూరమైన ఆ తల్లి లంకలోని అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నా నిరంతరం రామనామ స్మరణతోనే కాలాన్ని గడిపింది. రాముని సోదరుడైన భరతుడు పాదుకాసేవన భక్తుడు. కైకేయి, కులగురువైన వశిష్ఠుడు.. ఇలా ఎంత మంది చెప్పినా సింహాసనాన్ని తాను అధిరోహించలేదు. శ్రీరామపాదుకలకే పట్టాభిషేకం చేసి, భక్తితో ఆ పాదుకలను సేవించిన ఘనచరితుడు. మతంగ మహర్షి శిష్యుల ఆదేశాన్ని అనుసరించి 13 సంవత్సరాలపాటు రాముని రాకకై ఎదురుచూసి... ఆ స్వామిని భక్తితో పూజించి, అతిథి సత్కారాలను నిర్వర్తించి ముక్తినొందిన ధన్యురాలు శబరి. నిండు సభలో రావణునిచే అవమానింపబడి రాముని శరణువేడిన విభీషణుడు ప్రణామ భక్తుడు. అందుకే, యుద్ధానంతరం రాముడు అతణ్ని లంకాధిపతిని చేశాడు. ఇక, శ్రీరాముని ప్రియసోదరుడైన లక్ష్మణుడు దాస్యభక్తుడు. రాముని పాదాలను గట్టిగా పట్టుకొని ఆయన వెంటే అడవికి వెళ్లి, రాత్రింబవళ్లూ సేవలు చేసిన ధన్యచరితుడు సౌమిత్రి.   శ్రీరాముని సుఖమే తన సుఖంగా, శ్రీరాముని దుఃఖమే తన దుఃఖంగా భావించి సీతాన్వేషణలో సాయం చేసి గొప్ప మిత్రుడనిపించుకున్న సుగ్రీవుడిది సఖ్య భక్తి. ఇక, సీతాదేవిని ఎత్తుకుపోతున్న రావణుని ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన జటాయువు.. శరీర పరిత్యాగ భక్తుడు. రావణునితో పోరులో తీవ్రంగా గాయపడినా.. రామలక్ష్మణులు వచ్చేంతవరకూ తన ప్రాణాలను బిగబట్టుకొని సీతమ్మకు కలిగిన కష్టాన్ని గురించి తెలిపాకే అసువులు బాసిన భక్తుడు. శ్రీరామయణంలోని ఈ నవవిధ భక్తులు లోకానికంతటికీ ఆదర్శం.

- సముద్రాల శఠగోపాచార్య, 9059997267

Updated Date - 2020-06-27T07:44:35+05:30 IST