కొవాగ్జిన్ తీసుకున్న వారికి నో ఎంట్రీ
ABN , First Publish Date - 2021-05-24T10:49:47+05:30 IST
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికే తమ దేశాల్లోకి ఎంట్రీ అంటూ.. గల్ఫ్ దేశాలు నిబంధనలకు సిద్ధమవుతున్నాయి.
గల్ఫ్లో ప్రవాసీయులకు ప్రవేశ సమస్యలు
టీకాకు గుర్తింపు లేకపోవడంతో ఇక్కట్లు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికే తమ దేశాల్లోకి ఎంట్రీ అంటూ.. గల్ఫ్ దేశాలు నిబంధనలకు సిద్ధమవుతున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న విదేశీయులకు మాత్రమే అనుమతిస్తామంటూ సౌదీ అరేబియా ప్రకటించింది, ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్ వ్యాక్సిన్లు తీసుకున్న వారు అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎయిర్లైన్స్కు సమర్పించిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తామని పేర్కొంది. గల్ఫ్లోని ఇతర దేశాల వారికి కూడా ఇదే రకమైన నిబంధనలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
కొవాగ్జిన్కు గుర్తింపు లేనందునే..
గల్ఫ్, ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలేవీ భారత్ ఉత్పత్తి చేసే కొవాగ్జిన్ను గుర్తించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ టీకాను తన జాబితాలో ప్రకటించలేదు. భారతీయులు చాలా మంది కొవాగ్జిన్ వైపే మొగ్గు చూపుతున్నారు. సెలవులపై మాతృదేశానికి వెళ్లిన అనేక మంది ప్రవాసీయులు తమ ఆధార్ కార్డుల ఆధారంగా కొవాగ్జిన్ తీసుకున్నారు. అయితే ఆధార్ కార్డులను కాకుండా పాస్ పోర్టులను మాత్రమే విమానయాన సంస్థలు గుర్తిస్తాయి. ఇటీవల బహ్రెయిన్ మీదుగా రోడ్డు మార్గాన సౌదీ అరేబియాకు వచ్చిన అనేక మంది భారతీయులను అక్కడి అధికారులు వెనక్కి పంపించారు. వ్యాక్సిన్ దౌత్యం పేర మోదీ సర్కారు విదేశాలకు పంపిన టీకాల్లో అత్యధికంగా కొవిషీల్డ్ ఉన్నాయి. దీంతో.. ఇప్పుడు కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న ప్రవాసీయులు అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. సకాలంలో వెళ్లలేక ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వారిలో నెలకొంది.