సర్కారీ క్వారంటైన్‌ కేంద్రాలు ఉండవు

ABN , First Publish Date - 2020-04-09T09:48:55+05:30 IST

విదేశాల నుంచి వచ్చే వారు లేకపోవడం, మర్కజ్‌ యాత్రికులు, వారి సంబంధీకుల ఇంక్యుబేషన్‌ సమయం పూర్తి కావడంతో ఇక నుంచి సర్కారీ క్వారంటైన్‌ కేంద్రాలు ఉండవని, పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌ పర్సన్లను

సర్కారీ క్వారంటైన్‌ కేంద్రాలు ఉండవు

నేటితో 167 సెంటర్లు ఖాళీ అవుతాయి

పాజిటివ్‌ల కాంటాక్ట్‌లందరికీ హోం క్వారంటైనే

4, 5 రోజుల తర్వాత కొత్త కేసులు తగ్గుతాయి: ఈటల


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి వచ్చే వారు లేకపోవడం, మర్కజ్‌ యాత్రికులు, వారి సంబంధీకుల ఇంక్యుబేషన్‌ సమయం పూర్తి కావడంతో ఇక నుంచి సర్కారీ క్వారంటైన్‌ కేంద్రాలు ఉండవని, పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌ పర్సన్లను హోం క్వారంటైన్‌లో ఉంచుతామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని 167 క్వారంటైన్‌ కేంద్రాలు గురువారం ఖాళీ అవుతాయని తెలిపారు. ఒకటీ.. అరా కేసులొచ్చినా పాజిటివ్‌ అయితే గాంధీలో చికిత్స అందిస్తామని, నెగెటివ్‌ అయితే హోం క్వారంటైన్‌లో ఉంచుతామని పేర్కొన్నారు. కోఠిలోని కరోనా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి పదకొండు వందల మందికిపైగా మర్కజ్‌కు వెళ్లొచ్చారని, అందరికీ పరీక్షలు చేశామన్నారు. ప్రస్తుతం 167 సెంటర్లలో 3,158 మంది క్వారంటైన్‌లో ఉన్నారని, వీరందరినీ గురువారం ఇళ్లకు పంపుతామని చెప్పారు. అయితే, వీరందరూ ఈ నెల 21 వరకూ ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందన్నారు. పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతి రోజూ వీళ్లను పరిశీలిస్తారని చెప్పారు. కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈటల తెలిపారు. ‘మర్కజ్‌’కు సంబంధించి 535 మంది శాంపిళ్లు  ేసకరించి పెట్టామని, గురువారం సాయంత్రానికి వీటి ఫలితాలు వస్తాయన్నారు. నాలుగైదు రోజుల తర్వాత కొత్త కేసుల నమోదు పూర్తిగా తగ్గిపోతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్‌-95 మాస్కులు, పీపీఈ కిట్లు సమకూర్చుకోవడంలో తొలుత కొంత ఇబ్బంది ఎదురైనా, ఇప్పడు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 80వేల పీపీఈ కిట్లు, లక్షకుపైగా ఎన్‌-95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అదనంగా 5 లక్షల పీపీఈ కిట్లు, 5 లక్షల మాస్కులు, కోటికిపైగా హ్యాండ్‌గ్లౌజులకు ఆర్డర్‌ ఇచ్చామన్నారు. సామూహిక దశలో వైరస్‌ వ్యాపించనందున రాష్ట్రంలో ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ టెస్టులు చేయబోమని తెలిపారు. ఇప్పటిలాగే అవసరమైన వాళ్లకు ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు చేయిస్తుందన్నారు. ఇందుకోసం 3.5 లక్షల పరీక్షా కిట్లు ఆర్డర్‌ చేశామన్నారు. ప్రస్తుతం చెస్ట్‌, కింగ్‌ కోఠి, గాంధీ ఆస్పత్రుల్లో బాధితులు ఉన్నారని, ఇకపై గాంధీలో మాత్రమే చికిత్స అందిస్తామని తెలిపారు.

Updated Date - 2020-04-09T09:48:55+05:30 IST