నవదంపతుల జీవన ప్రయాణం.. 20రోజుల్లోనే విషాద తీరాలకు

ABN , First Publish Date - 2021-07-09T06:31:16+05:30 IST

ఎన్నో ఆశలు.. మరెన్నో ఊహలతో నిర్మించుకున్న కలల ప్రపంచం దరిచేరని అలగా మారిపోయింది. పట్టలేనంత సంతోషంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నూతన జంట జీవన ప్రయాణం అర్ధాంతరంగా

నవదంపతుల జీవన ప్రయాణం.. 20రోజుల్లోనే విషాద తీరాలకు

అమరావతి: ఎన్నో ఆశలు.. మరెన్నో ఊహలతో నిర్మించుకున్న కలల ప్రపంచం దరిచేరని అలగా మారిపోయింది. పట్టలేనంత సంతోషంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నూతన జంట జీవన ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. నవదంపతుల జీవన ప్రయాణాన్ని ఓ రోడ్డు ప్రమాదం.. ఇరవై రోజుల్లోనే విషాద తీరాలకు చేర్చిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 



అనంతపురానికి చెందిన విష్ణు వర్దన్ (28), కడపకు చెందిన కుల్వ కీర్తి (25).. జీవితంలో ఎదగాలని ఎన్నో కలలు కన్నారు. అందుకోసం రాత్రి, పగలు  తేడా లేకుండా కష్టపడ్డారు. వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఉన్నత విద్యాభ్యాసం చేసి, అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు. అక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ పెద్దల సమక్షంలో జూన్ 19న అంగరంగ వైభంగా వివాహం జరిగింది. రెండు రోజుల క్రితం బెంగళూరులోని బంధువుల ఇంటికి వెళ్లిన ఈ నవదంపతులు.. బుధవారం రోజు కారులో అనంతపురానికి తిరుగు ప్రయాణం అయ్యారు.


ఈ నేపథ్యంలో బొమ్మేపర్తి గ్రామ సమీపానికి చేరుకున్నారు. రోడ్డు దాటే సమయంలో అడ్డుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పింది. దీంతో డివైడరును ఢీకొని, అటువైపు వస్తున్న మరో వాహనాన్ని కూడా ఢీకొని, రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని గమనించిన స్థానికులు.. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కీర్తి ప్రాణాలు కోల్పోయారు. విష్ణువర్ధన్ పరిస్థితి విషమించడంతో.. అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తదిశ్వాస విడిచారు. విషయం తెలియడంతో ఇరువురి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2021-07-09T06:31:16+05:30 IST