యూఏఈలో 70 రోజుల తర్వాత 10వేలకు దిగువలో యాక్టివ్ కేసులు..
ABN , First Publish Date - 2020-07-10T14:40:48+05:30 IST
70 రోజుల తర్వాత తొలిసారి యూఏఈలో కరోనా యాక్టివ్ కేసులు 10వేలకు దిగువగా నమోదయ్యాయి.
యూఏఈ: 70 రోజుల తర్వాత తొలిసారి యూఏఈలో కరోనా యాక్టివ్ కేసులు 10వేలకు దిగువగా నమోదయ్యాయి. ఏప్రిల్ 30న దేశవ్యాప్తంగా 9,947గా ఉన్న యాక్టివ్ కేసులు.. ఆ తర్వాత గురువారం 9,679గా నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక నిన్న 532 కొత్త కేసులు నమోదు కాగా... 1,288 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు యూఏఈ వ్యాప్తంగా 53,577 మంది కోవిడ్-19 బారిన పడగా... 43,570 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా 328 మంది ఈ మహమ్మారి వల్ల చనిపోయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. క్రమంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో యూఏఈలో రికవరీ రేటు 81.32 శాతానికి చేరింది. అయితే, ప్రపంచ సగటు రికవరీ రేటు 58.17 శాతంగా ఉంది. ఇక ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణకు యూఏఈ ముమ్మరంగా కోవిడ్ టెస్టులు చేస్తోంది. ఇప్పటికే 4 మిలియన్ల వరకు కరోనా పరీక్షలు నిర్వహించగా... ఆగస్టు నెలాఖరు వరకు 6 మిలియన్ల కోవిడ్ టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.