పశువుల సంత వేలం లేక రూ. లక్షల ఆదాయానికి గండి

ABN , First Publish Date - 2021-06-21T04:30:14+05:30 IST

వైరా మునిసిపాలిటీలో రెండేళ్ల నుంచి పశువుల సంత వేలంపాట నిర్వహించటం లేదు.

పశువుల సంత వేలం లేక రూ. లక్షల ఆదాయానికి గండి
వైరాలో అనధికారిక పశువుల సంత

  ఆర్థికంగా నష్టపోతున్న వైరా మునిసిపాలిటీ

వైరా, జూన్‌ 20: వైరా మునిసిపాలిటీలో రెండేళ్ల నుంచి పశువుల సంత వేలంపాట నిర్వహించటం లేదు. ఫలితంగా దాదాపు రూ.50లక్షలమేర ఆదాయాన్ని మునిసిపాలిటీ కోల్పోయింది. ప్రతి ఆదివారం అనధికారికంగా కొంతమంది పశువుల వ్యాపారులు సంతలో లక్షలాదిరూపాయలు వ్యాపారం చేస్తూ పశువుల రవాణా కొనసాగిస్తున్నారు. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా పశువుల సంత వేలంపాట నిర్వహించటం లేదు. దాంతో అధికారికంగా సంత నిర్వహణ జరగటం లేదు. అయినప్పటికీ పశువుల వ్యాపారులు మాత్రం ప్రతి ఆదివారం సంత వద్ద యధావిధిగా పశువుల కొనుగోళ్లు, అమ్మకాలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆటోలు, వ్యాన్ల ద్వారా ఇక్కడకు పశువులను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇక్కడి వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి కంటైనర్లు ఇతర వాహనాల ద్వారా ఇతర ప్రాంతాల్లోని కభేళాలకు రవాణా చేస్తున్నారు. ప్రతి ఆదివారం లక్షలాదిరూపాయల క్రయవిక్రయాలు నడుస్తున్నాయి. సోమవరం(వైరా) మేజర్‌ పంచాయతీగా ఉన్న నాటి నుంచి ప్రతి ఏటా పశువుల సంత వేలంపాట నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. మునిసిపాలిటీ ఏర్పడి మొదటి ఏడాది కూడా పశువుల సంత వేలంపాట నిర్వహించారు. ఈ సంత ద్వారా మునిసిపాలిటీకి రూ.25లక్షల ఆదాయం వచ్చింది. 

గత ఏడాది రూ.25వేల నష్టం 

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా 2020 మార్చిలో పశువుల సంత వేలంపాట నిర్వహించలేదు. దానివలన మునిసిపాలిటీ గత ఏడాది రూ.25లక్షల ఆదాయం కోల్పోయింది. అలాగే ఈ ఏడాది మార్చిలో కూడా పశువుల సంత వేలంపాట నిర్వహించలేదు. ఫలితంగా ఈ సంవత్సరం కూడా మరో రూ.25లక్షల ఆదాయం నష్టపోయింది. కరోనా వలన కొన్నినెలలపాటు లాక్‌డౌన్‌ విధించినప్పటికీ గత ఏడాది, ఈ ఏడాది మూడ్నాలుగునెలలు మినహాయించి సంత వేలంపాట నిర్వహించినా కనీసం రూ.40లక్షల ఆదాయమైనా మునిసిపాలిటీకి వచ్చిఉండేదని స్థానికులు అంటున్నారు. ఈ విషయాన్ని అధికారులు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. 

అనధికార సంత 

పశువుల సంత వేలంపాట నిర్వహించనప్పటికీ అనధికారిక సంత నిర్వహణ, వ్యాపారాలు ప్రతి ఆదివారం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అనధికారిక వ్యాపారులు చూసిచూడనట్లు వదిలేస్తున్నందుకుగానూ కొంతమందికి ఎంతోకొంత వ్యాపారులు ముట్టచెపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అనధికారిక సంతలో కొనుగోలు చేసిన పశువులను దారుణంగా కాళ్లు విరగగొట్టి కంటైనర్లలో పడేసి కభేళాలకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మునిసిపాలిటీ కోల్పోతున్న ఆదాయాన్ని రాబట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వైరా మునిసిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌ను వివరణ కోరగా పశువుల సంత వేలంపాట విషయమై అధికారులతో ఇప్పటికే అనేకసార్లు చర్చించామని తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌ వలన సంత వేలంపాట నిర్వహించటానికి ఇబ్బందికరంగా ఉందన్నారు. అయితే మునిసిపాలిటీ ఆదాయాన్ని పెంచుకొనేదానిలో భాగంగా పశువుల సంత వేలంపాట నిర్వహణకు సంబంధించి మళ్ళీ అధికారులతో చర్చిస్తానని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-21T04:30:14+05:30 IST