శాండ్, ల్యాండ్, వైన్, మైన్ దోపిడీతో జేబులు నింపుకుంటున్నారు: పీతల సుజాత

ABN , First Publish Date - 2021-12-11T18:34:29+05:30 IST

పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..

శాండ్, ల్యాండ్, వైన్, మైన్ దోపిడీతో జేబులు నింపుకుంటున్నారు: పీతల సుజాత

జంగారెడ్డిగూడెం : పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ దోపిడీతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారన్నారు. ఇప్పుడు పేద ప్రజలను కూడా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి గత ప్రభుత్వాలు చేసిన పనులను తాము చేసినట్టు రంగులు వేసుకుని ప్రభుత్వం గొప్పలు చెప్పిందని పీతల సుజాత పేర్కొన్నారు. ఇక ఇప్పుడైతే ఏకంగా 83 నుంచి ప్రభుత్వాలు పేదలకు కట్టించిన పక్కా ఇళ్ల మీద పట్టాల పేరుతో వన్ టైం సెటిల్మెంట్ అంటూ వేల కోట్లు గుంజుతోందన్నారు. 


ప్రజలు ఎవరూ కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టనవసరం లేదని స్పష్టం చేశారు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవించే హక్కును అందించిందన్నారు. రేపు వచ్చేది టీడీపీ ప్రభుత్వమే కనుక పేదలందరికీ ఉచితంగా పట్టాలు అందజేయడం జరుగుతోందన్నారు. ప్రజలందరూ కూడా ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పీతల సుజాత పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పాలన చేయకుండా తమ ఇష్ట ప్రకారం చేయాలని చూస్తోందని విమర్శించారు. అధికారం ఉంది కదాని తమ ఇష్టం వచ్చినట్లు పాలన చేయడానికి ఇదేమి రాచరికం కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్... ఇలాంటి పాలకులు వస్తారనే బాబాసాహెబ్ అంబేద్కర్ పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి పనిచేసేలా చట్టాలు రూపొందించారన్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పాలన సాగిస్తూ పేదలను దోచుకుంటోందని పీతల సుజాత వాపోయారు.


Updated Date - 2021-12-11T18:34:29+05:30 IST