ఫుల్ జోష్తో వచ్చేస్తున్న ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్
ABN , First Publish Date - 2020-12-06T01:11:54+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైన ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) ఎట్టకేలకు వచ్చేస్తోంది. ఈ నెల 24 నుంచి జైపూర్
హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైన ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) ఎట్టకేలకు వచ్చేస్తోంది. ఈ నెల 24 నుంచి జైపూర్ వేదికగా పీహెచ్ఎల్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా నేడు జైపూర్లో లీగ్ షెడ్యూల్, జట్ల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అరిశెనపల్లి జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు ఆనందీశ్వర్ పాండే ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్మోహన్రావు మాట్లాడుతూ భారత హ్యాండ్బాల్ చరిత్రలో పీహెచ్ఎల్తో ఒక నవశకం ఆరంభమైందని అన్నారు. పీహెచ్ఎల్తో దేశంలోని హ్యాండ్బాల్కు కార్పొరేట్ కళ వస్తుందన్నారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు వర్ధమాన క్రీడాకారులకు ఇది మంచి వేదిక అవుతుందని చెప్పారు. ఒలింపిక్స్లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ లీగ్ తోడ్పడుతుందన్నారు. విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడనుండడంతో భారత యువ ఆటగాళ్లకు కలిసి వస్తుందని, వారి నుంచి మరిన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం చిక్కుతుందని పేర్కొన్నారు.
ఈ లీగ్లో తెలంగాణ టైగర్స్తో సహా మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. 30 లీగ్, 3 నాకౌట్తో కలిపి మొత్తం 33 మ్యాచ్లు జరగనున్నాయి. కొవిడ్ కారణంగా తొలి సీజన్ మ్యాచ్లన్నీ జైపూర్లోనే జరగనున్నాయి. 18 రోజులు పాటు జరగనున్న ఈ లీగ్ వచ్చే నెల 10న ముగుస్తుంది. లీగ్లో విదేశీ ఆటగాళ్లతో కలిపి మొత్తం 80 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. లీగ్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టులో 14 మంది ప్లేయర్లు ఉండగా అందులో ఇద్దరు ఆసియా, ఒక యూరప్ ఆటగాడు ఉంటారు. మ్యాచ్లు సోనీ చానెల్తో పాటు ఎయిర్టెల్, జీయో టీవీలో ప్రత్యక్షప్రసారం కానున్నాయి.