బాధిత బాలికలకు అండ.. 200కు పైగా కేసుల్లో నిందితులకు శిక్ష
ABN , First Publish Date - 2021-04-24T16:59:20+05:30 IST
బాలికలపై లైంగిక దాడి చేసిన వారు తప్పించుకోకుండా ఉండేందుకు
హైదరాబాద్ సిటీ : బాలికలపై లైంగిక దాడి చేసిన వారు తప్పించుకోకుండా ఉండేందుకు నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం పూర్తిస్థాయి సేవలు అందిస్తోంది. మూడేళ్లుగా కొనసాగుతున్న పోక్సో కోర్టులో ఇప్పటి వరకు రెండు వందలకు పైగా కేసుల్లో నిందితులకు శిక్ష పడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 మందికి పదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష పడింది.
బాధితుల ఆవేదనను పరిగణలోకి తీసుకుని సత్వర న్యాయం చేస్తోంది. పోక్సో కేసు నిందితులకు జీవితఖైదు శిక్ష విధించడమే కాకుండా ఆయా కేసుల విచారణ కొన్ని నెలల వ్యవధిలోనే పూర్తవుతోంది. చిన్నారులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరుగుతుండడంతో పోక్సో చట్టం అమలు కఠినతరం చేశారు. ఇతర కోర్టుల్లో కొనసాగే ఈ కేసులు వాయిదా పడుతూ జాప్యం జరగడంతో పోక్సో అమలు పెద్ద మార్పును తెచ్చింది. 2018 ఏప్రిల్లో బాధిత చిన్నారుల కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. ఇటీవల కాంలంలో సైఫాబాద్, నాంపల్లి, సైదాబాద్, ఛత్రినాక, రెయిన్బజార్తోపాటు నగరంలో పలు పోలీస్స్టేషన్ల పరిధుల్లో నిందితులకు పోక్సో చట్టం కింద శిక్షలు పడ్డాయి.