వైరస్కు రాజకీయ బూస్ట్!
ABN , First Publish Date - 2021-04-17T06:01:21+05:30 IST
వైరస్కు రాజకీయ బూస్ట్!
షర్మిల సభకు హాజరైన ముఖ్య నాయకులకు పాజిటివ్
కొందరు కిందిస్థాయి కార్యకర్తలకు కూడా..
ఇంటింటికి కల్యాణలక్ష్మి చెక్కుల అందజేతతో ఇతర ప్రజాప్రతినిధులకూ వైరస్
ఖమ్మం సంక్షేమ విభాగం, ఏప్రిల్ 16: కరోనా మహమ్మారి విస్తరించేందుకు కావాల్సిన బూస్ట్ రాజకీయపార్టీల ద్వారా అందుతోందని వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్చి చివరి వరకు ఖమ్మం జిల్లాలో నామమాత్రంగా ఉన్న పాజిటివ్ కేసులు ఒక్కసారిగా రాష్ట్రంలోనే గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. అయితే ఇలా ఒక్కసారిగా కేసులు పెరగటంపై గ్రామస్థాయి నుంచి వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీశారు. కరోనాను కట్టడి చేయాల్సిన సమయం లోనే సభలు, సమావేశాలు, పలురాజకీయ కార్యక్రమాలు వైరస్వ్యాప్తికి మరింత ఊత మిచ్చాయని వైద్యశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ నెల 9న ఖమ్మంలో జరిగిన వైఎస్ షర్మిల సంకల్ప సభలో పాల్గొన్న నాయకుల్లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారిలో కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, కొందరు హోంక్వారంటైన్లో ఉన్నట్టు తెలిసింది. వీరితో పాటు గ్రామాలనుంచి సభకు హాజరైన కార్యకర్తల్లో చాలామంది కరోనా బారిన పడ్డారని, వారి కుటుంబాల్లో కూడా చాలమందికి కొవిడ్ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఒక్కసారిగా జిల్లాలో కరోనా తీవ్రత పెరగటానికి రాజకీయ సభలు, సమావేశాలే కారణమని తెలుస్తొంది. ఇదిలా ఉంటే జిల్లాలోని ఓ ఎమ్మెల్యే నిత్యం ఇంటింటికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో సదరు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీలు, ముగ్గురు సర్పంచులు, చెక్కులు తీసుకున్న పలువురు లబ్ధిదారులు కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. తల్లాడ మండలంలో 100మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక్కరోజులో 30మందికిపైగా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అధికారికంగా ఎలాంటి హెల్త్ బులిటెన్లు ఇవ్వకపోతుండటంతో వాస్తవ లెక్కలపై గందరగోళం ఏర్పడుతోంది.