సహనం కోల్పోయిన బైడెన్.. రిపోర్టర్పై సీరియస్!
ABN , First Publish Date - 2021-06-18T17:17:02+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విలేకర్ల సమావేశంలో సహనం కోల్పోయారు.
జెనీవా: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విలేకర్ల సమావేశంలో సహనం కోల్పోయారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో తొలి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన బైడెన్కు ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న సహనం కోల్పోయేలా చేసింది. అంతే.. సదరు రిపోర్టర్పై బైడెన్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. చివరగా వెళ్లేటప్పుడు రిపోర్టర్కు బైడెన్ క్షమాపణలు చెప్పారు. ఇంతకు బైడెన్ సహనం కోల్పోయేలా రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏంటి? అసలు ఆ రిపోర్టర్ ఎవరు?
వివరాల్లోకి వెళ్తే.. సీఎన్ఎన్ వైట్హౌస్ చీఫ్ కరెస్పాండెంట్ కైట్లాన్ కొలిన్స్పైనే బైడెన్ సీరియస్ అయ్యారు. పుతిన్తో సమావేశం అనంతరం ఆమె అడిగిన ప్రశ్న బైడెన్కు ఆగ్రహం తెప్పించింది. ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే.. ఈ సమావేశం తర్వాతనైనా పుతిన్ తన ప్రవర్తనను మార్చుకుంటారని మీరు నమ్ముతున్నారా? అని బైడెన్ను కైట్లాన్ ప్రశ్నించారు. అంతే.. రిపోర్టర్ ప్రశ్నతో బైడెన్ ఒక్కసారిగా ఆమెపై మండిపడ్డారు. "అతను తన ప్రవర్తనను మార్చుకుంటాడని నాకు నమ్మకం లేదు. అయినా నేను నమ్ముతున్నానని ఎప్పుడు చెప్పాను? నేను ఒక వాస్తవాన్ని చెబుతున్నానంతే. అది మీకు అర్థం కాకపోతే నేనేమీ చేయలేను" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరగా సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి బయల్దేరిన బైడెన్ వెనక్కి వచ్చి ఆ రిపోర్టర్కు క్షమాపణ చెప్పారు.