దేశమంతా మీ వెంటే
ABN , First Publish Date - 2021-07-14T08:21:18+05:30 IST
ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి
భారత అథ్లెట్లకు ప్రధాని పిలుపు
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన వర్చువల్ ద్వారా పీవీ సింధు, దీపికా కుమారి, శరత్ కమల్, సానియా, మేరీ కోమ్, వినేశ్ ఫోగట్ తదితర క్రీడాకారులు, వారి కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. ఆద్యంతం సరదా సరదాగా, చమక్కులతో ప్రధాని ఈ భేటీని కొనసాగించారు. టోక్యో గేమ్స్లో ఒత్తిడికి లోను కాకుండా ధైర్యంగా ముందడుగు వేయాలంటూ వారిలో స్ఫూర్తి నింపారు. ఈక్రమంలో అథ్లెట్ల కుటుంబాలు చేసిన తాగ్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక తమ పిల్లలను క్రీడల్లోకి తేవాలనుకునే తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారంటూ సింధు తల్లిదండ్రులను ప్రశ్నించారు. భారత్లో టెన్ని్సకు పెరుగుతున్న ఆదరణ ఎలా ఉందంటూ సానియాను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి వరల్డ్ చాంపియన్షి్పలో స్వర్ణం సాధించిన ఆర్చర్ దీపికా కుమారిని కూడా ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలావుండగా పతకాలను సాధించడం అలవాటుగా మారే నయా భారత్ ఎంతో దూరంలో లేదని ఆయన అభిలషించారు. అలాగే అథ్లెట్ల కోసం అభిమానులంతా ‘చీర్ఫర్ ఇండియా’ అంటూ మద్దతు పలకాలని ప్రధాని కోరారు. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు.
భారత్ నుంచి మొత్తం 228.. అథ్లెట్లు 119
టోక్యో ఒలింపిక్స్కు భారత్ నుంచి మొత్తం 228 మందితో కూడిన బృందం వెళ్లనుంది. ఇందులో 119 మంది అథ్లెట్లు అని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా మంగళవారం తెలిపారు. వీరిలో 67 మంది పురుష అథ్లెట్లు, 52 మంది క్రీడాకారిణులు ఉన్నారన్నారు. మొత్తం 87 పతకాంశాల్లో భారత అథ్లెట్లు పోటీపడుతున్నారని బాత్రా వెల్లడించారు. తొలి విడతలో భాగంగా 90 మందితో కూడిన అథ్లెట్లు, అధికారుల బృందం ఈనెల 17న టోక్యో బయలుదేరనుంది.
సింధు.. ఈసారి ఐస్క్రీం తిందాం
తెలుగు తేజం పీవీ సింధుతో ఓ పాత సంఘటనను ప్రధాని మోదీ గుర్తు చేశారు. ‘2016 రియో ఒలింపిక్స్లో ఐస్క్రీమ్ తినకుండా నీపై నిషేధం ఉండేది. టోక్యోలో కూడా ఇది కొనసాగనుందా?’ అని మోదీ అడగగా.. నా డైట్పై జాగ్రత్తగా ఉన్నానంటూ సింధు జవాబిచ్చింది. అంతేకాకుండా ఈసారి పతకం గెలిస్తే ఇద్దరం కలిసి ఐస్క్రీమ్ తిందామంటూ ప్రధాని సరదాగా వ్యాఖ్యానించారు.