క్వార్టర్‌ రూ.1000

ABN , First Publish Date - 2020-04-06T08:50:06+05:30 IST

లాక్‌డౌన్‌ అక్రమ మద్యం వ్యాపారులకు వరంలా మారింది. ఇప్పటి వరకూ సీసాపై రూ.50నుంచి రూ.వంద అదనంగా తీసుకుని అమ్మినవారు ఇప్పుడు కళ్లు తిరిగే

క్వార్టర్‌ రూ.1000

  • అక్రమంగా మద్యం అమ్మకాలు 
  • నాలుగు రెట్లు అదనంగా వసూళ్లు 
  • చెప్పిన ధర చెల్లిస్తేనే సీసా చేతికి
  • జేబు నింపుకుంటున్న వ్యాపారులు


అమరావతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ అక్రమ మద్యం వ్యాపారులకు వరంలా మారింది. ఇప్పటి వరకూ సీసాపై రూ.50నుంచి రూ.వంద అదనంగా తీసుకుని అమ్మినవారు ఇప్పుడు కళ్లు తిరిగే ధరలకు మద్యం అమ్ముతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నేతల అండతో పాటు అధికార యంత్రాంగం నుంచి కూడా కొంత సహకారం ఉండటంతో ఈ దందాకు అడ్డులేకుండా పోయింది. లాక్‌డౌన్‌ ఉన్నన్ని రోజులు అందినకాడికి దండుకోవడమే లక్ష్యంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఏ బ్రాండ్‌ అయినా అసలు ధరపై మూడు, నాలుగు రెట్లు అదనపు రేటుపెట్టి, మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నారు. చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ సగటున రూ.150 ఉంటే, ఇప్పుడు దానిని రూ.700వరకూ అమ్ముతున్నారు. క్వార్టర్‌ రూ.250 విలువచేసే మీడియం బ్రాండ్‌ను రూ.వెయ్యికి అమ్ముతున్నారు. షాపుల్లో ఫుల్‌ సీసా కొంటే మొత్తం ధరలో కొంత తగ్గుతుంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటివేం ఉండవు. ఫుల్‌ కొన్నా చెప్పిన రేటు సమర్పించుకుంటేనే సీసా చేతికిస్తారు. రేటు ఎంతైనా సీసా చేతికి రావడమే గొప్ప అనుకునే పరిస్థితికి మందుబాబులు రావడంతో వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది.


మద్యం ఎలా వస్తోంది? 

లాక్‌డౌన్‌లో స్థానిక నాయకులు, అధికారుల సహకారంతో ప్రభుత్వ షాపుల నుంచే అనేకచోట్ల మద్యాన్ని బయటకు తెస్తున్నారు. దీనికి సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లు సహకరిస్తున్నారు. తలా కొంచెం పంచుకునే విధానంలోనే అక్రమ వ్యాపారం జరుగుతోంది.  ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో ఓ సీఐ ఏకంగా సరుకు తరలిస్తూ దొరికిపోయాడు. ప్రకాశం జిల్లాలో షాపుల్లో దొంగతనాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. బార్లపైనా ఎక్సైజ్‌కు నియంత్రణ లేకుండా పోయింది.

Updated Date - 2020-04-06T08:50:06+05:30 IST