కరోనా రెండోసారి వ్యాప్తి బూటకం: ఆర్.నారాయణమూర్తి
ABN , First Publish Date - 2021-03-21T21:22:45+05:30 IST
కరోనా రెండోసారి వ్యాప్తిచెందటం అనేది బూటకమని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు.
విజయవాడ: కరోనా రెండోసారి వ్యాప్తిచెందటం అనేది బూటకమని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం హాస్యానందం సంస్థ ఏర్పాటు చేసిన కార్టూన్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. బహుళజాతి సంస్థలు తయారు చేసిన శానిటైజర్లు, మాస్క్లు, ఇతర మెడికల్ వస్తువులు అమ్ముకొని సొమ్ముచేసుకోవటానికే ఈ ఎత్తుగడ అన్నారు. ప్రభుత్వం కూడా కార్పొరేట్ సంస్ధలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
కరోనా వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రమే చాలా ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ శక్తులు అదానీ, అంబానీలు మాత్రం వేల కోట్లు దండుకున్నారన్నారు. ఎందరో ప్రాణ త్యాగాలు చేసి ఏర్పాటు చేసిన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రవేటీకరించటం దారుణమన్నారు. పంచ భూతాలను కూడా అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఉద్యమానికి, విశాఖ ఉక్కు ఉద్యమానికి అందరూ మద్దతు ప్రకటించాలని ఆర్.నారాయణమూర్తి కోరారు.