వేరే ఎవరికీ ఓదార్పు చేసే హక్కు లేదా?: రఘురామ

ABN , First Publish Date - 2021-08-17T19:32:50+05:30 IST

రమ్యను వేధించి హతమార్చిన ఘటన ఎంతోమందిని బాధించిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

వేరే ఎవరికీ ఓదార్పు చేసే హక్కు లేదా?: రఘురామ

న్యూఢిల్లీ: బీటెక్ చదువుతున్న రమ్యను వేధించి హతమార్చిన ఘటన ఎంతోమందిని బాధించిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు పరమర్శించాలని వెళ్తే వారిని అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఓదార్పు కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్ సొంతహక్కుగా భావించారా?.. వేరే ఎవరికీ ఓదార్పు చేసే హక్కు లేదా? అని ప్రశ్నించారు. సీఎం ఓదారిస్తే శాంతి భద్రతల ఉంటాయి... వేరే వారు ఓదారిస్తే శాంతి భద్రతలు ఉండవా? అని నిలదీశారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఓదార్పు హక్కు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామ గుర్తు చేశారు. దిశ చట్టం ఇంకా అమలు కావడం లేదని, అమలు కానీ చట్టాలు పేరు మీద జనాలను మోసం చేయొద్దన్నారు. ఐదేళ్లు మంత్రిగా ఉన్న నక్క ఆనంద్ బాబుపై ఎస్పీ చేయి చేసుకున్నట్లు తెలిసిందని, అది మంచిది కాదన్నారు. ముఖ్యమంత్రి పోలీసులను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం జగన్, రమ్య కుటుంబాన్ని పరమర్శించాలన్నారు. ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి బయటకు రారని, వచ్చిన వారిని అరెస్ట్ చేస్తారని రఘురామ విమర్శించారు. 


ఏ-2 విజయసాయిరెడ్డి బెయిల్‌పై కౌంటర్ వేశారని, ఏ-1, ఏ-2లపై ఇవాళ మరో రెండు చార్జి షీట్లను ఈడీ దాఖలు చేసిందని రఘురామ అన్నారు. ప్రజలు ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్జికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నానే తప్ప తాను ప్రచారం చేసుకోవడం లేదన్నారు. బ్లాంక్ జీవోలు ఇవ్వడం ఎంతమేరకు సముచితమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎందుకు పారదర్శకత పాటించడంలేదని నిలదీశారు. జీవోలను అందుబాటులో ఉంచాలని రఘురామ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-17T19:32:50+05:30 IST