రైతును ముంచిన వడగండ్లు
ABN , First Publish Date - 2020-04-09T09:10:15+05:30 IST
రాష్ట్రంలో బుధవారం అకాల వర్షం, వడగండ్లు, ఈదురు గాలులు రైతును నట్టేట ముంచాయి. వీటి ధాటికి పలు జిల్లాల్లోని వందలాది ఎకరాల్లో వరి, మామిడి, ద్రాక్ష, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వనపర్తి జిల్లాలో 4031 ఎకరాల్లో వరి దెబ్బతింది. ఈదురు గాలులకు మామిడి కూడా నేలరాలింది.
వరి, ద్రాక్ష, మామిడికి తీవ్ర నష్టం
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్: రాష్ట్రంలో బుధవారం అకాల వర్షం, వడగండ్లు, ఈదురు గాలులు రైతును నట్టేట ముంచాయి. వీటి ధాటికి పలు జిల్లాల్లోని వందలాది ఎకరాల్లో వరి, మామిడి, ద్రాక్ష, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వనపర్తి జిల్లాలో 4031 ఎకరాల్లో వరి దెబ్బతింది. ఈదురు గాలులకు మామిడి కూడా నేలరాలింది. ఉద్యానశాఖ అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం 200 ఎకరాల్లో పంట పాడైంది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కూడా తడిసిపోయింది. నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల్లో గాలివానతో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో వరి, ద్రాక్ష, మామిడి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు సుమారు 14 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో వరి 13 వేల ఎకరాల్లో దెబ్బతినటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. గురు, శుక్రవారాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.