భర్తతో కలిసి కారులో ఇంటికి వెళ్తుండగా.. సోదరుల నుంచి ఎదురైన ఊహించని పరిణామం!

ABN , First Publish Date - 2021-10-03T17:47:23+05:30 IST

ఇంట్లో గొడవపడి..

భర్తతో కలిసి కారులో ఇంటికి వెళ్తుండగా.. సోదరుల నుంచి ఎదురైన ఊహించని పరిణామం!

ఇంటర్‌నెట్‌డెస్క్: ఇంట్లో గొడవపడి ప్రేమ వివాహం చేసుకుంది. ఓ రోజు భర్తతో కలిసి గుడికి వెళ్లి కారులో ఇంటికి పయనమైంది. ఆ సమయంలో ఆమె సోదరులు కనపడడంతో సంతోషపడింది. కానీ వారి నుంచి ఊహించని పరిణామం ఎదురవడంతో బిత్తరపోయింది. సమయానికి భర్త జాగ్రత్త పడ్డాడు గానీ, లేకపోతే ఘోరం జరిగిపోయేది. అసలు విషయంలోకి వస్తే..


రాజస్థాన్‌లోని నాగపూర్ జిల్లాలోని నవాన్ పట్టణానికి చెందిన రేణు అనే మహిళ, అదే ప్రాంతానికి చెందిన ఓంప్రకాశ్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వారు ఇంటినుంచి వెళ్లిపోయి గతేడాది అక్టోబర్ 29న ప్రేమవివాహం చేసుకున్నారు. అప్పటినుంచి ఆమెపై కోపం పెంచుకున్న సోదరులు కుంజ్ బిహారీ, విశాల్.. నిత్యం గొడవకు దిగేవారు. చంపేస్తామని బెదిరించేవారు. దీంతో ప్రేమికులిద్దరూ ప్రాణరక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటినుంచి ఓంప్రకాశ్, రేణు ఇద్దరూ వేరే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.



కోపం తగ్గని సోదరులు అవకాశం దొరికినప్పుడల్లా ఆమెను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించేవారు. శుక్రవారం రాత్రి కూడా మరోసారి ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. గుడికి వెళ్లి వస్తున్న ఓంప్రకాశ్, రేణు కారును సోదరులు ఆపారు. ఇంటికి రావాలని గొడవకు దిగారు. ఆమె కాదనడంతో మరింత కోపోద్రిక్తులైనారు. వారి వెంట తెచ్చుకున్న ఓ సీసాను తెరవబోయారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన భర్త ఓంప్రకాశ్ కారు అద్దాలను వెంటనే పైకి ఎత్తాడు. లేదంటే ఘోరం జరిగిపోయేది. సోదరులు తెచ్చుకున్న యాసిడ్ కారుపై చల్లారు. యాసిడ్ దెబ్బకు కారు పాక్షికంగా దెబ్బతింది. అదే ఆమెపై పడి ఉంటే.. ఘోరం జరిగిపోయేది. ఓంప్రకాశ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 



Updated Date - 2021-10-03T17:47:23+05:30 IST