మీ పిల్లలకు కూడా ఈ అలవాటు ఉందేమో గమనించండి.. ఓ 14ఏళ్ల కుర్రాడు ఇంటినుంచి ఎందుకు పారిపోయాడో తెలిస్తే..
ABN , First Publish Date - 2021-10-09T17:56:17+05:30 IST
లాక్డౌన్ కారణంగా పిల్లలలో..
ఇంటర్నెట్డెస్క్: లాక్డౌన్ కారణంగా పిల్లలలో అనేక మార్పులు వచ్చాయి. అప్పటివరకు పాఠశాలలకు వెళ్తూ.. పుస్తకాలతో, ఆటలతో కాలం గడిపేస్తున్న పిల్లలు ఒక్కసారిగా లాక్డౌన్ కారణంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో మొబైల్ ఫోన్ను కొనిస్తే.. చదువును పక్కనపెట్టేసి ఆన్లైన్ గేమ్స్కు బానిసలయ్యారు. ఈ ఆన్లైన్ గేమ్స్.. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని అనేక సంఘటనలు రుజువు చేశాయి. అలాంటి మరో సంఘటనే రాజస్థాన్లోని నాగపూర్ జిల్లా మెర్టా పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పట్టణానికి చెందిన 14ఏళ్ల కుర్రాడు అందరితో కలిసిపోయి, జోకులు వేస్తూ సరదాగా ఉండేవాడు. అయితే లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడడంతో.. ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు. తమ పిల్లాడు ఇంట్లోనే ఉంటూ.. చదువుకుంటున్నాడులే అనుకున్న తల్లిదండ్రులకు ఆ కుర్రాడు పెద్ద షాకే ఇచ్చాడు. ఆన్లైన్ గేమ్స్కు బానిసైన ఆ కుర్రాడు.. ఓ రోజు నుంచి ఇంటి నుంచి పారిపోయాడు. పోతూపోతూ ఓ వెండి గొలుసును, రూ.37వేలు, ఆడుకోవడానికి ఓ సెల్ఫోన్ను పట్టుకెళ్లాడు.
పిల్లాడు కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంట్లో ఉన్న వారి సెల్ఫోన్లు పరిశీలించగా.. అందులో ఓ కొత్త నంబర్ కనిపించింది. ఆ నంబర్కు ఫోన్ చేయగా.. ఆ కుర్రాడి ఆన్లైన్ గేమ్ స్నేహితుడు షాహిల్ మాట్లాడాడు. మీరు తిట్టనంటే.. అసలు విషయం చెబుతానన్నాడు.
పోలీసులు సరేననడంతో.. విషయం చెప్పాడు. ఆ కుర్రాడికి పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేదని, పాఠశాలకు వెళ్తే ఆన్లైన్ గేమ్స్ ఆడే అవకాశం ఉండడంలేదని, అందుకే పారిపోయాడని చెప్పాడు. ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడని అడగ్గా.. జైపూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాడని ఓ ఫోన్ నంబర్ ఇచ్చాడు. దీంతో పోలీసులు నంబర్ను ట్రేస్ చేసి ఆ కుర్రాడిని పట్టుకున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు ఓ కంటకనిపెడుతుండాలని తల్లిదండ్రులను పోలీసులు హెచ్చిరించారు. పిల్లాడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.