అధునాతన టెక్నాలజీతో ‘కరోనా’కు చెక్
ABN , First Publish Date - 2020-07-02T17:39:11+05:30 IST
కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు అధునాతన టెక్నాలజీతో రూపొందించిన పరికరాలను ఉపయోగించేందుకు జిల్లాయంత్రాంగం
అందుబాటులో కొవిడ్-19 నివారణ పరికరాలు
కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్జిల్లా ప్రతినిధి) : కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు అధునాతన టెక్నాలజీతో రూపొందించిన పరికరాలను ఉపయోగించేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. కొవిడ్-19 నివారణలో భాగంగా పలు సంస్థలు రూపొందిస్తున్న శానిటైజ్ పరికరాలను కార్యాలయాల్లో వినియోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులోభాగంగా బుధవారం కలెక్టరేట్ నుంచి ఏసీటీ గ్రాంట్స్ యాజమాన్యంతో జిల్లాకలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నివారణ కోసం అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన ‘కరోనా శానిటైజ్, గోఅస్యూర్’ పరికరాల పనితీరును పరిశీలించారు. వీటివల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని ఏసీటీ సంస్థ ప్రతినిధులు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం ఏసీటీ గ్రాంట్స్ వారి సౌజన్యంతో రూపొందించిన పరికరాలను జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు ఎంవోయూ (మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్) సిద్ధం చేసుకోవాలని వెల్లడించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని, ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజలందరూ భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రత, ముఖానికి మాస్కు ధరించడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా వైద్యాధికారి వీరాంజనేయులు, జిల్లా సర్వేలైన్స్ అధికారి రాంకుమార్ పాల్గొన్నారు.