ఇద్దరు బాలికలపై అఘాయిత్యం

ABN , First Publish Date - 2020-12-05T05:07:20+05:30 IST

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగిన సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గుండాల మండలంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించిన ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడగా.. పాల్వంచ మండలం సీతానగర్‌కాలనీకి చెందిన పదోతరగతి బాలికను చంపుతానని బెదిరించి అత్యాచారం చేశాడు ఓ ఆటోడ్రైవర్‌.

ఇద్దరు బాలికలపై అఘాయిత్యం

భద్రాద్రి జిల్లాలో రెండు వేర్వేరు అత్యాచార ఘటనలు

ఆలస్యంగా వెలుగులోకి..

గుండాల/ పాల్వంచరూరల్‌, డిసెంబరు 4: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగిన సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గుండాల మండలంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించిన ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడగా.. పాల్వంచ మండలం సీతానగర్‌కాలనీకి చెందిన పదోతరగతి బాలికను చంపుతానని బెదిరించి అత్యాచారం చేశాడు ఓ ఆటోడ్రైవర్‌. ఈ రెండు సంఘటనపై శుక్రవారం ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గుండాల మండలంలోని చెందిన గుగులోత్‌ దేవా అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికపై మూడు రోజుల కిందట అత్యాచారం చేశాడు. ఆ బాలిక బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. ఆమెను తన ఇంట్లోకి పిలిచి, చెంపలపై కొట్టి.,. భయపెట్టి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పనుల నిమిత్తం పక్క గ్రామానికి వెళ్లి శుక్రవారం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ఆ బాలిక జరిగిన విషయాన్ని చెప్పడంతో వారు గుండాల సీఐ సీహెచ్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఐ ముత్యం రమేష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమెదు చేసుకుని విచారణ చేపట్టారు. సంఘటన వివరాలను బాలిక నుంచి సేకరించారు. అయితే ప్రస్తుతం ఆ నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. పాల్వంచ మండలం సీతానగర్‌కాలనీలో నివాసముంటూ స్థానికంగా పదోతరగతి చదువుతున్న బాలికపై సోములగూడెం గ్రామానికి చెందిన తేనె సురేష్‌ అనే ఆటో డ్రైవర్‌ మనసుపడ్డాడు. ఆమెపై అఘాయిత్యం చేసేందుకు వేచి చూస్తున్న సురేష్‌.. గురువారం తన స్నేహితురాలి దగ్గర పాఠ్య పుస్తకం కోసం వెళుతున్న ఆ బాలికను అడ్డగించాడు. మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని సోములగూడెంలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించి ఆ బాలికపై ఆత్యాచారం చేశాడు. అనంతరం ఇంటికి చేరుకున్న బాలిక ఇంట్లోని శానిటైజర్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. దానిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను పాల్వంచలోని ఆస్పత్రికి తరలించి.. కారణాలను ఆరా తీయగా.. కన్నీరుమున్నీరైన ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పాల్వంచ పోలీసులు నిందితుడిపై రేప్‌, ఫోక్సో కేసులు నమోదుచేశామని పాల్వంచరూరల్‌ ఎస్‌ఐ సుమన్‌ తెలిపారు.

Updated Date - 2020-12-05T05:07:20+05:30 IST