68 నామినేషన్ల తిరస్కరణ
ABN , First Publish Date - 2020-11-22T09:00:32+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లకు దాఖలైన నామినేషన్లలో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
1825 ఓకే.. ముగిసిన నామినేషన్ల పరిశీలన
2 చోట్ల ముగ్గురు పిల్లల వివాదం
గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్థి
కూన శ్రీనివాస్గౌడ్ నామినేషన్
తిరస్కరణతో ఆందోళన, లాఠీచార్జి
ముగ్గురు పిల్లలుండడమే కారణం
రేవంత్రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
శ్రీశైలంగౌడ్ అరెస్టు.. ఆస్పత్రికి
బీ ఫారంకు నేడు తుది గడువు
34 చోట్ల ఇంకా అభ్యర్థులను
ప్రకటించని కాంగ్రెస్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లకు దాఖలైన నామినేషన్లలో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 1825 నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్లు ఽఅదికారులు తెలిపారు. తిరస్కరణకు గురైన వాటిలో గరిష్ఠంగా వివేకానందనగర్లో ఐదు ఉన్నాయి. పలు చోట్ల ముగ్గురు పిల్లలున్నారన్న వివాదం, ఫిర్యాదులు కనిపించాయి. ముగ్గురు పిల్లల కారణంగా గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివా్సగౌడ్ నామినేషన్ను తిరస్కరించారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి వెల్దండ వెంకటేశ్కు నలుగురు పిల్లలున్నారని, కానీ అఫిడవిట్లో తప్పుగా చూపారని టీఆర్ఎస్ అభ్యర్థి కాజా సూర్యనారాయణ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. తనకు 1995 తరువాత ముగ్గురు సంతానం ఉందని, మొదటి కాన్పులో ఒకరు, రెండో సారి కవలలు పుట్టారని వివరాలు ఆర్ఓకు చూపెట్టారు. నాలుగో సంతానంగా చెబుతోన్న పాప తన తమ్ముడి కూతురని, ఆమె జనన ధ్రువీకరణ పత్రం సమర్పించారు. దీంతో వెంకటేష్ నామినేషన్ను రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదించారు.
ఇక పరిశీలన అనంతరం మిగిలిన వాటిలో గరిష్ఠంగా జంగంమెట్లో 25, మల్లాపూర్లో 23 నామినేషన్లు ఉన్నాయి. కనిష్ఠంగా బార్కా్సలో ముగ్గురు, మొఘల్పుర, అహ్మద్నగర్లలో నలుగురు చొప్పున బరిలో నిలిచారు. అయితే ఆదివారం సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు ఉండంతో రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఈ లోగానే పార్టీ బీఫారం సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఇంకా 34 డివిజన్లలో అభ్యర్థులను ప్రకటించలేదు. సికింద్రాబాద్ పరిధిలో ఉన్న ఈ డివిజన్లలో ఆశావహులు నామినేషన్లు వేశారు.
టీఆర్ఎస్, బీజేపీల నుంచే ఎక్కువ!
గ్రేటర్ పోరుకు మొత్తం 1893 మంది 2575 నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు రెండు, మూడు సెట్లు దాఖలు చేయడంతో నామినేషన్ల సంఖ్య పెరిగింది. పరిశీలన అనంతరం 1825 నామినేషన్లు ఆమోదించారు. బీ-ఫారంల సమర్పణకు గడువు ఉన్న నేపథ్యంలో ఎందరు బరిలో ఉంటారు..? ఎంత మంది ఉపసంహరించుకుంటారు..? అన్నది ఆదివారం తేలనుంది.