పుస్తెలతాడు చోరీ.. సీసీ ఫుటేజీలను పరిశీలించగా..
ABN , First Publish Date - 2020-12-14T14:40:42+05:30 IST
పుస్తెలతాడు చోరీ.. సీసీ ఫుటేజీలను పరిశీలించగా..
హైదరాబాద్ : ఇంట్లోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు మహిళ నోరుమూసి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును అపహరించిన సంఘటన చిలకలగూడ పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి కథనం ప్రకారం... షాబాద్గూడకు చెందిన స్రవంతి, శ్రీధర్ భార్యాభర్తలు. ఏవీఎం రెసిడెన్సీ అపార్ట్మెంట్లో మూడో అంతస్తులో ఉంటున్నారు. ఆదివారం ఉదయం శ్రీధర్ బయటకు వెళ్లగా స్రవంతి ఇంట్లోనే ఉంది. ఉదయం 10:45నిమిషాల సమయంలో కాలింగ్బెల్ శబ్దం వినిపించి తలుపులు తెరిచింది. ఇద్దరు ఆగంతుకులు ఇంట్లోకి చొరబడి స్రవంతి నోరుమూసి ఆమె మెడలోని రెండున్నర తులాల పుస్తెల తాడును తెంపుకుని క్షణాల్లో పరారయ్యారు.
షాక్ నుంచి తేరుకున్న స్రవంతి భర్తతో పాటు పోలీసులకు సమాచారం అందించింది. అపార్ట్మెంట్ సీసీ ఫుటేజీలను పరిశీలించగా, ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల సంచారం నమోదు కాలేదు. తెలియని వ్యక్తులు ఎవరూ పైకి వెళ్లలేదని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఒకసారి పెద్ద గొలుసని, మరోసారి నల్లపూసల తాడు అని బాధితురాలు పోలీసులకు చెప్పడం విశేషం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.