నా సభలకు కరెంట్ కట్ చేయిస్తారా?
ABN , First Publish Date - 2021-08-04T09:12:49+05:30 IST
‘కేసీఆర్... నేను ఏ పట్టణానికి వెళ్లినా అక్కడ కరెంటు కట్ చేయించి, నా కార్యక్రమాలకు ఆటంకాలు కలిగిస్తున్నావ్.
కేసీఆర్.. నీ కరెంట్ కట్ చేస్తా
బహుజన శంఖారావంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఈ నెల 8న బీఎస్పీలో చేరుతున్నట్టు ప్రకటన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన మాజీ ఐపీఎస్
తరలివచ్చిన స్వేరోస్ కార్యకర్తలు, బీఎస్పీ నాయకులు
కొత్తగూడెం / పాల్వంచ రూరల్ / కూసుమంచి, ఆగస్టు 3: ‘కేసీఆర్... నేను ఏ పట్టణానికి వెళ్లినా అక్కడ కరెంటు కట్ చేయించి, నా కార్యక్రమాలకు ఆటంకాలు కలిగిస్తున్నావ్. ఇలాంటివాటిని సహించం. నీ కరెంటు కట్ చేసే సమయం ఆసన్నమైంది’ అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజనులంతా ఐక్యంగా ఉద్యమించి సొంత రాజ్యస్థాపన కోసం కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలో మంగళవారం రాత్రి బహుజన శంఖారావం సభకు ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బహుజనుల అభ్యున్నతి కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమన్నారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే డబ్బును కేసీఆర్ ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారని, ఇకముందు అలాంటి కార్యక్రమాలను సహించేది లేదన్నారు.
ప్రవీణ్ కుమార్కు స్వేరోస్ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాల్వంచలోని అంబేద్కర్, కొమరం భీమ్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేశారు. పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సభకు వెళ్లే మార్గంలో ఆగి... రైల్వే స్థలాల్లో నిర్మాణాలను కూల్చివేయడంతో నిరాశ్రయులైన వారిని పరామర్శించారు. వారికోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన వసతి గృహంలో ఇబ్బందులను ఆరాతీశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులకు భోజనం, వైద్యం, వసతి సౌకర్యాలను కల్పించాలని కోరారు. నాయకన్గూడెం వద్ద రోడ్డు పక్కన బజ్జీల బండి నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న వారి స్ధితిగతులను ప్రవీణ్కుమార్ తెలుసుకున్నారు. స్వయంగా బజ్జీలు వేశారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని సూచించారు. బడుగులకు రాజ్యాధికారం కోసం ఈ నెల 8న బీఎస్పీలో చేరుతున్నట్టు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ సృష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో పర్యటన సందర్భంగా ప్రవీణ్ కుమార్కు పలుచోట్ల ఘనస్వాగతం లభించింది. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.