హమాలీలుగా ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు

ABN , First Publish Date - 2021-05-20T08:49:40+05:30 IST

ఆర్టీసీలో ప్రవేశపెట్టిన పార్సిల్‌, కార్గో, కొరియర్‌ (పీసీసీ) సేవల్లో కం డక్టర్లు, డ్రైవర్లను హమాలీలుగా వాడుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

హమాలీలుగా ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో ప్రవేశపెట్టిన పార్సిల్‌, కార్గో, కొరియర్‌ (పీసీసీ) సేవల్లో కం డక్టర్లు, డ్రైవర్లను హమాలీలుగా వాడుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. సరుకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ పనులు అప్పగిస్తూ అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. 8 టన్నులు, 4 టన్నుల సామర్థ్యం గల బస్సులను పార్సిల్‌, కార్గో సే వలకు వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వివి ధ జిల్లాలకు టెక్ట్స్‌ బుక్స్‌ను, నాచారంలోని తెలంగాణ ఫుడ్స్‌ నుంచి బాలామృతాన్ని తీసుకెళుతున్నాయి. ఈ సరుకును అన్‌లోడ్‌ చేయడానికి హైదరాబాద్‌ నుంచే కండక్టర్లు, డ్రైవర్లను కార్గో బస్సుల్లో పంపుతున్నారని ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి ఆరోపించారు. 


వీరు అక్కడికి వెళ్లి బాలామృతం బ్యాగులను అన్‌లోడ్‌ చేస్తున్నారని.. కండక్టర్‌, డ్రైవర్‌ విధులు నిర్వహించాల్సిన సిబ్బందిని హమాలీ పనులకు వినియోగిస్తుండటం దారుణమన్నారు. హమాలీ విధులను తిరస్కరించే డ్రైవర్లు, కండక్టర్లను ఇతర ప్రాంతాలకు బ దిలీ చేస్తామని, సస్పెండ్‌ చేస్తామంటూ డిపో మేనేజ ర్లు, ఇతర అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని.. కండక్టర్లు, డ్రైవర్లకు హమాలీ పనులు అప్పగించవద్దని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ సిబ్బంది తలదించుకునేలా, ఆత్మాభిమానం దెబ్బతినేలా యాజమాన్యం లేబర్‌ విధులు అప్పగిస్తోందని తెలంగాణ జాతీయ మ జ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ము దిరాజ్‌ ఆరోపించారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయనుకుంటే కూలీ బతుకులయ్యాయని సిబ్బంది బాధపడుతున్నారన్నారు. యాజమాన్యం ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-20T08:49:40+05:30 IST