Mumbai Rape Case: ‘ఆమె’ చనిపోయింది!

ABN , First Publish Date - 2021-09-11T20:54:42+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సకినాక ప్రాంతంలో జరిగిన అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో

Mumbai Rape Case: ‘ఆమె’ చనిపోయింది!

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సకినాక ప్రాంతంలో జరిగిన అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. ఘట్కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పరిస్థితి విషమించడంతో నేడు మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి.


శుక్రవారం తెల్లవారుజామున సకినాక ప్రాంతంలోని ఖైరాని రోడ్డుపై ఆమెపై అత్యాచారం జరిగింది. నిందితుడు తొలుత అత్యాచారం చేసిన అనంతరం అత్యంత పాశవిక చర్యకు ఒడిగట్టాడు. ఆమె రహస్య భాగాల్లో రాడ్డును చొప్పించి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.  


అక్కడి సీసీటీవీ ఫుటేజీలను సేకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం నిందితుడు ఆమెను ఓ టెంపోలో పడేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో, అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూముకు సమాచారం అందించడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.


సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడైన 45 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనక మరికొందరు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించిన నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేస్తామని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. 

Updated Date - 2021-09-11T20:54:42+05:30 IST