సాక్షి టీవీ అనుమతులు రద్దు

ABN , First Publish Date - 2022-02-24T11:13:54+05:30 IST

సాక్షి టీవీ అనుమతులు రద్దు

సాక్షి టీవీ అనుమతులు రద్దు

చానళ్ల జాబితా నుంచి పేరు తొలగింపు

సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఇవ్వని కేంద్ర హోంశాఖ

గత నెలలోనే సమాచార శాఖ ఆదేశాలు.. టీ-హైకోర్టుకు ఉద్యోగులు

అనుమతుల పునరుద్ధరణకు విన్నపం.. తాత్కాలిక ఊరటనిచ్చిన హైకోర్టు

సీబీఐ, ఈడీ కేసులే కారణమా?.. గతంలో చానల్‌ ఖాతాలు ‘ఫ్రీజ్‌’


అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ సొంత టీవీ చానల్‌ ‘సాక్షి’కి కేంద్ర సమాచార, ప్రసార శాఖ షాక్‌ ఇచ్చింది. ‘సాక్షి’ టీవీకి జారీ చేసిన అనుమతిని రద్దు చేసింది. దేశంలో అనుమతించిన చానళ్ల జాబితా నుంచి ‘సాక్షి’ని తొలగించింది. గత నెల 20వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘సాక్షి’కి కేంద్ర హోం శాఖ ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌’ ఇవ్వకపోవడమే దీనికి కారణం! దేశ అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని... కొన్ని ప్రమాణాలకు లోబడి మాత్రమే చానళ్లకు కేంద్ర హోంశాఖ ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌’ మంజూరు చేస్తుంది. అది ఉంటేనే... సదరు చానల్‌కు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అనుమతి లభిస్తుంది. మరి... స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందిన చానల్‌కు హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఎందుకు ఇవ్వలేదు? ఆ చానల్‌ నుంచి అంతర్గత భద్రతకు ముప్పు ఉందని భావించిందా? లేక... జగన్‌పై అక్రమాస్తుల కేసులు ఉన్నందుకేనా? ఇవేవీ కాకుండా... మరేవైనా కారణాలు ఉన్నా యా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియదు. కానీ... సాక్షి టీవీ ఉద్యోగులు హుటాహుటిన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి, చానల్‌ను మూసేస్తే వందలమంది జీవనోపాధి దెబ్బతింటుందని చెప్పడంతో... అక్కడ తాత్కాలికంగా ఊరట లభించింది.


ఇలా... అనుమతులు రద్దు

‘సాక్షి’ టీవీకి అనుమతులు రద్దు చేస్తూ గతనెల 20వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌ సంస్థ సాక్షి టీవీ పేరుతో నడిపే చానల్‌కు 2006 జూన్‌ 7వ తేదీన పదేళ్లపాటు అప్‌లింక్‌, డౌన్‌లింక్‌ అనుమతులు జారీ చేశాం. చానల్‌ ఏర్పాటు కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి, అన్ని అర్హతలు ఉంటే సెక్యూరిటీ క్లియరెన్స్‌ కోసం కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపిస్తాం. తొలుత ఇచ్చిన అనుమతి కాలం ముగిసిపోవడంతో... సాక్షి టీవీ మరోసారి అనుమతుల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకుంది. 2016 జూన్‌ 7 నుంచి 2026 జూన్‌ 6వ తేదీ వరకు ప్రసారాలను అనుమతించాలని కోరింది. ఈ దరఖాస్తును కూడా కేంద్ర హోంశాఖకు పంపించాం. అయితే... సాక్షి టీవీకి సెక్యూరిటీ క్లియరెన్స్‌ను హోంశాఖ నిరాకరించింది’’ అని సమాచార, ప్రసార శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో... ‘సాక్షి టీవీని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి’ అంటూ ఆ సంస్థకు 2021 డిసెంబరు 31వ తేదీన షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. దీనికి ఆ సంస్థ గతనెల 13న సమాధానం ఇచ్చింది. తమ చానల్‌కు కేంద్ర హోంశాఖ అనుమతులు ఎందుకు ఇవ్వలేదో తెలియదని, ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని కోరింది. ఈ వివరణను సమాచార, ప్రసార శాఖ పరిశీలించింది. అయితే... దేశ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకుని, కొన్ని ప్రమాణాలకు లోబడి హోంశాఖ సెక్యూరిటీ   క్లియరెన్స్‌ ఇస్తుంది. అదే లేకపోవడంతో... సాక్షి టీవీ ప్రసారాల అనుమతిని పునరుద్ధరించలేమని స్పష్టం చేసింది. ‘‘ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌కు జారీ చేసిన అనుమతిని రద్దు చేస్తున్నాం. దేశంలో అనుమతించిన ప్రైవేట్‌ చానళ్ల నుంచి సాక్షి టీవీ పేరు తొలగిస్తున్నాం’’ అని సమాచార, ప్రసార శాఖ స్పష్టం చేసింది.


హైకోర్టులో ‘తాత్కాలిక’ ఊరట

‘సాక్షి టీవీ’కి అనుమతులు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆ చానల్‌ సిబ్బంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చానల్‌  ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోందని... రద్దు ఆదేశాలను కొట్టివేసి, అనుమతుల పునరుద్ధరణకు తగిన ఆదేశాలు ఇవ్వాలని 15 మంది ఉద్యోగులు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. తగిన కారణాలు చూపకుండానే కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను  నిరాకరించిందని తెలిపారు. ‘‘ఏదైనా ప్రతికూల చర్య తీసుకునే ముందు సంబంధిత సంస్థకు చెందిన వాటాదారులు, కార్మికులు, వినియోగదారులు, ఇతరుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ... ఇందుకు విరుద్ధంగా చానల్‌ అనుమతులు రద్దు చేశారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, ఏకపక్షంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం వల్ల కంపెనీ అస్తిత్వానికి, ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతుంది. కంపెనీ అనుమతి/లైసెన్స్‌ మంజూరుకు సంబంధించి ఎలాంటి భద్రతా సంబంధిత నిబంధనలను ఉల్లంఘించలేదు’’ అని తెలిపారు. గతంలోనూ ఇలాగే ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌కు టెలిపోర్ట్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు. ఆ పిటిషన్‌ ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు చానల్‌కు అనుమతులు రద్దు చేయడం సరికాదని తెలిపారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ‘సాక్షి టీవీ’కి తాత్కాలికంగా ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చేనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయి.


ఏమిటీ ‘క్లియరెన్స్‌’?

టీవీ చానళ్ల అప్‌లింక్‌, డౌన్‌లింక్‌ అనుమతులను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంజూరు చేస్తుంది. అయితే... చానల్‌ ఎవరు పెడుతున్నారు? డైరెక్టర్లు ఎవరు? వారి నేపథ్యం ఏమిటి? అనే వివరాలను కేంద్ర హోంశాఖ పరిశీలిస్తుంది. ఉదాహరణకు... వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, మాఫియా నేతలు న్యూస్‌ చానళ్లు పెట్టి... దేశ వ్యతిరేక ప్రచారం చేస్తే ఎలా? అందుకే... అన్నీ పరిశీలించి కేంద్ర హోంశాఖ ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌’ జారీ చేస్తుంది. ఇక... అప్పటికే సెక్యూరిటీ అనుమతులు ఇచ్చినప్పటికీ, యాజమాన్యం మారినా, షేర్‌ హోల్డర్లు మారినా సెక్యూరిటీ క్లియరెన్స్‌ అవసరమవుతుంది. ఇక... ‘సాక్షి టీవీ’ విషయంలో ఈ అనుమతి నిరాకరించడానికి బయటికి చెప్పలేని అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2006లో తన తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా... జగన్‌ ఈ చానల్‌ను ప్రారంభించారు. అప్పుడు... ఆయనే ఈ చానల్‌కు సారథి. ఆ తర్వాత జగన్‌పై అనేక అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. ‘క్విడ్‌ ప్రో కో’లో భాగంగా ముడుపులు తీసుకుని, వాటినే తన మీడియా సంస్థల్లో పెట్టుబడులుగా చూపించారని సీబీఐ నిర్ధారించింది. ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా కేసులు పెట్టింది. ‘సాక్షి టీవీ’ ఖాతాలను స్తంభింపచేసింది. ఆ తర్వాత సాక్షి టీవీ చైర్‌పర్సన్‌గా ఆయన సతీమణి భారతి బాధ్యతలు స్వీకరించారు. జగన్‌ సీఎం అయిన తర్వాత భారతి, సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు బోర్డు నుంచి తప్పుకొన్నారు. అటు సాక్షి టీవీపై కేసులు, ఇటు యాజమాన్య మార్పులు! ఇదే క్రమంలో కేంద్ర హోంశాఖ జగన్‌ చానల్‌కు ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌’ను నిరాకరించడం సంచలనం సృష్టిస్తోంది. 

Updated Date - 2022-02-24T11:13:54+05:30 IST